ముంబై : పఠాన్ మూవీపై దేశవ్యాప్తంగా హిందూ సంస్ధల నిరసనలు ఉధృతం కావడంతో ముంబైకి చెందిన ఓ ముస్లిం మతగురువు స్పందించారు. షారుక్ సినిమాపై మీరు నిజంగా నిరసన తెలపాలనుకుంటే బాలీవుడ్ స్టార్ ఇంటికి వెళ్లి అతడిని కాల్చిచంపాలని, మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని రజా అకాడమీకి చెందిన మత గురువు ఖలీలుర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. ఈ సినిమా ముస్లింలకు సంబంధించినది కాదని అలాగే బాలీవుడ్ కూడా ముస్లింలది కాదని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పఠాన్ మూవీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్ సభ్యులు అభ్యంతరకర నినాదాలు చేసిన నేపధ్యంలో ఖలీలుర్ రెహ్మాన్ స్పందించారు. బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ దీనికంతటికీ కారణమని, విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆమెను అరెస్ట్ చేశారని ఇలాంటి ఉద్రిక్త వాతావరణం నెలకొనకూడదని రెహ్మన్ ఆకాంక్షించారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
భజరంగ్ దళ్ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలతో కూడిన వీడియో వైరల్ కావడంతో ఇండోర్లోని చందన్ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్న ముస్లిం సంఘాల నేతలు, సభ్యులు నిరసన చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర నినాదాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా పఠాన్ సినిమాలోని బేషరం రంగ్ పాటలో దీపికా పదుకునే కాషాయ రంగు బికినీ ధరించడం వివాదాస్పదమైంది. వీహెచ్పీ, భజరంగ్ దళ్ నేతలు ఈ సినిమాను నిషేధించాలని పట్టుబట్టారు. ఇక వివాదాల నడుమ ఈనెల 25న విడుదలైన పఠాన్ మూవీ పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా షారుక్ మూవీ 100 కోట్లు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.