ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఘట్కోపర్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరేఖ్ హాస్పిటల్ వెనుక భాగంలోని ఓ భవనంలో జునోస్ పిజ్జా రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఆ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
మంటలను అదుపు చేయడం కోసం ఒకటి తర్వాత ఒకటి 8 ఫైరింజన్లను రప్పించి చివరికి మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో కొందరికి గాయాలయ్యాయి. మరికొందరు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ పరేఖ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు.