లక్నో : యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్ధాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) ఆరడుగుల ఎత్తైన విగ్రహాన్ని అనుమతి లేదంటూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. హర్ధోయ్లోని పార్టీ కార్యాలయంలో ఎస్పీ నేతలు ములాయం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
నోటీసు జారీ చేసిన అనంతరం ముందస్తు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించామని అధికారులు మంగళవారం వెల్లడించారు. నగర్ పాలిక పరిషత్ కార్యాలయం సమీపంలోని ఎస్పీ ఆఫీస్ ప్లాట్ఫాంపై విగ్రహాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరేంద్ర యాదవ్ నెలకొల్పారు. విగ్రహం ఏర్పాటుపై నగర పాలక సంస్ధ స్పందిస్తూ ఈనెల 23న యాదవ్కు నోటీసులు జారీ చేసింది.
విగ్రహాన్ని 24 గంటల్లో తొలగించని పక్షంలో తాము చర్యలు చేపడతామని నోటీసులో అధికారులు స్పష్టం చేశారు. పార్టీ సభ్యులు రూ. 10 లక్షలు సమీకరించి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు అలంకార్ సింగ్ తెలిపారు. తమపై ఒత్తిడి తీసుకువచ్చి అధికారులు విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. నోటీసు వచ్చిన తర్వాత ఈనెల 23నే తాము విగ్రహాన్ని కిందకు దించామని చెప్పారు. అనుమతి లేకుండా ఎస్పీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నోటీసు జారీ చేసిన అనంతరం తొలగించామని నగర పాలిక పరిషత్ ఈవో వినోద్ కుమార్ సోలంకి తెలిపారు.
Read More :