న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంతి, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీ పార్టీలో చేరారు. ఆ పార్టీ కార్యాలయంలో బిహార్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, బీజేపీ యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో కాషాయ పార్టీ తీర్థం స్వీకరించారు. అనంతరం నేతలిద్దరూ ఆమెకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు దేశం ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంటుందన్న అపర్ణ.. మోదీ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నది.
అపర్ణ యాదవ్.. ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు పత్రీక్ యాదవ్ సతీమణి. అపర్ణ లక్నో కాంట్ అసెంబ్లీ స్థానం టికెట్ ఆశిస్తున్నారు. 2017లో అదే స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు. అపర్ణ బీజేపీలో చేరడంతో యూపీలో ఈ సారి అధికారంలోకి రావాలని చూస్తున్న సమాజ్వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరుగనుండగా.. మార్చి 7న చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.