Mulayam Singh Yadav | సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోమవారం కన్నుమూశారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తన రాజకీయ జీవితంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ రక్షణ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఉపాధ్యాయుడిగా సేవలందించారు. ములాయం సింగ్ యాదవ్ 1939 నవంబర్ 22న ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లా సైఫాయ్లో జన్మించారు. ములాయం రాష్ట్రంలోని ఇటావా, ఫతేహాబాద్, ఆగ్రాల్లోనూ విద్యాభ్యాసం జరిగింది. జైన్ ఇంటర్ కాలేజ్, కర్హల్ (మెయిన్పురి)లో చదువుకున్నారు. ఆయన బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ (BT) పూర్తి చేయడంతో పాటు డిగ్రీలో బీఏ పూర్తి చేశారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్లో ఎంఏ పూర్తి చేశారు.
రాజకీయరంగ ప్రవేశానికి ముందు ములాయం సింగ్ యాదవ్ ఉపాధ్యాయుడిగా పని చేశారు. కర్హల్ ప్రాంతంలోని జైన్ ఇంటర్ కళాశాల నుంచి చదివారు. నిజానికి 1955లో ములాయం సింగ్ యాదవ్ జైన్ ఇంటర్ కాలేజీలో తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ తీసుకున్నాడు. 1959లో ఇక్కడి నుంచి ఇంటర్ చదివి, 1963లో అసిస్టెంట్ టీచర్గా పాఠాలు బోధించారు. అప్పట్లో ఆయనకు నెలకు వేతనం రూ.120 వచ్చేది. హైస్కూల్లో హిందీ, ఇంటర్లో సోషల్ సైన్స్ బోధించేవారు. ములాయం సింగ్ యాదవ్ బోధనా శైలి చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉండేదని పలువురు తెలిపారు. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలు చెప్పలేదని, సబ్జెక్ట్పై విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా చూశారని పేర్కొన్నారు. అలాగే పిల్లలను కొట్టడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు.
ములాయం సింగ్ యాదవ్ 1960 ప్రాంతంలో రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1992లో సమాజ్వాదీ పార్టీని స్థాపించారు. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మూడుసార్లు పని చేశారు. 1989-1991, 1993-1995, 2003 -2007 వరకు పని చేశారు. 1996 -1998 వరకు ములాయం సింగ్ యాదవ్ దేశ రక్షణ మంత్రిగానూ సేవలందించారు.