లక్నో : యూపీలో నిరుద్యోగ సమస్య తీవ్రతను కేవలం సమాజ్వాదీ పార్టీయే లేవనెత్తుతోందని ఆ పార్టీ వ్యవస్ధాపకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ నిరంతరం పేదలు, యువత, అణగారిన వర్గాల సంక్షేమానికి కట్టుబడిఉందని స్పష్టం చేశారు. ములాయం సింగ్ యాదవ్ శనివారం జన్పూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలపై అణిచివేత, కులం ఆధారంగా వేధింపులు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్న యువత నిరుద్యోగులుగా మారుతుంటే, రైతాంగానికి తమ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు.
రైతులు ఎంతో శ్రమించి వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చినా వాటికి సరైన ధర కరవవుతోందని పేర్కొన్నారు. రైతులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని, యువతకు ఉద్యోగాలు రావడం లేదని అలాగే సమాజంలో ఇతర వర్గాలనూ పాలక పక్షాలు విస్మరించాయని విమర్శించారు. పేదలు, అణగారిన వర్గాలు, యువత బాగు కోసం కేవలం ఎస్పీ ఒక్కటే పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్పీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వారు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. తన సభకు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఓటర్లకు తమ పార్టీ పట్ల ఎంత విశ్వసనీయత ఉందో అర్ధమవుతోందని అన్నారు.
తమ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ చిత్తశుద్ధితో నెరవేరుస్తుందని అన్నారు. యూపీలో ఎస్పీ అధికారంలోకి వస్తే వ్యాపారులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యోగి హయాంలో కొన్ని చోట్ల హింస చెలరేగుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అణిచివేత సాగుతోందని తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం చూడకుండా మనుషులందరినీ సమంగా చూస్తామని చెప్పారు.ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.