Mulayam Singh | సమాజ్వాదీ పార్టీ మార్గదర్శకుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. సోమవారం రోజు యూపీలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయానికి వచ్చి, కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. మా ఎరుపు టోపీని చూసి ప్రధాని మోదీ తెగ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘ఎర్ర టోపీని చూసి బీజేపీకి చెందిన పెద్దలు తెగ భయపడుతున్నారు. దీన్ని చూస్తే మీరు సరిగ్గానే పనిచేస్తున్నారని అర్థమవుతోంది. ఎన్నికల సందర్భంగా పూర్తి శక్తి యుక్తులతో కదన రంగంలోకి దూకాలి. రాష్ట్రంలో మన ప్రభుత్వం అధికారంలోకి రావాలి’. అంటూ ములాయం సింగ్ కార్యకర్తల్లో జోష్ నింపారు. గతంలో అధికారంలో ఉండగా, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, మహిళలకు పెన్షన్ ఇవ్వడం కానీ, యువకులకు ఉపాధి విషయంలోగానీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని ములాయం సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ గోరఖ్పూర్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎర్ర టోపీతో యూపీకి రెడ్ అలర్ట్ అని, వారికి ఎర్ర బుగ్గకార్ల కోసమే అధికారం కావాలని కోరుకుంటారని విమర్శించారు. అధికారంలోకి వస్తే వారు ఎర్ర బుగ్గలకు మాత్రమే ప్రాధాన్యమిస్తారని, ఎర్ర టోపీ ప్రమాద ఘంటిలకు సూచనలని మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉగ్రవాదులపై ఉదాసీనంగా ఉంటూ, వారిని జైళ్ల నుంచి బయటికి తీసుకొచ్చి, తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని ఎర్ర టోపీలు చూస్తున్నాంటూ మోదీ విరుచుకుపడ్డారు.