లక్నో : ఉత్తరప్రదేశ్కు చెందిన వివాదాస్పద నేత ముక్తార్ అన్సారీకి అలహాబాద్ హైకోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలర్ను బెరించిన కేసులో ముఖ్తార్ అన్సారీని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు కోర్టు అతనికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అలాగే రూ.37 వేల జరిమానా సైతం విధించింది. 2003లో ఖైదీగా ఉన్న సమయంలో ముక్తార్ అన్సారీకి కలిసేందుకు వచ్చిన వారిని తనిఖీలు చేయాలని అప్పటి జైలర్ ఎస్కే అవస్తీ ఆదేశించారు. దీంతో ఆగ్రహానికి గురైన ముఖ్తార్ అన్సారీ దుర్భాషలాడుతూ జైలర్పై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత అలంబాగ్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. కింది కేసుల్లో ముక్తార్ నిర్ధోషిగా బయటకు రాగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది.
ఈ సందర్భంగా ట్రయల్ కోర్టు దోషిగా ప్రకటించింది. ముక్తార్కు సంబంధించి దాదాపు డజన్కుపైగా కేసుల్లో విచారణ జరుగుతుండగా.. అతనిపై ఉత్తరప్రదేశ్లో 52కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. అన్సారీ ఉత్తరప్రదేశ్లోని మావు నియోజకవర్గం నుంచి గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అతనిపై ఘజియాబాద్ జిల్లాలోనే 38కిపైగా కేసులుండగా.. అన్నీ తీవ్ర నేరాలే. 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యకేసులో ప్రధాన నిందితుల్లో ఒకడు. 2009లో జరిగిన ఓ జంట హత్య కేసుకు సంబంధించిన కేసులోనూ నిందితుడే. 2019లో జైలు నుంచి ఫోన్ చేసి పంజాబ్లోని ఓ వ్యాపారవేత్తను బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు వారెంట్పై అన్సారీని పంజాబ్కు తరలించారు. తిరిగి అతన్ని ఉత్తరప్రదేశ్కు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా.. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. చివరకు కోర్టు తీర్పుతో అన్సారీని ఉత్తరప్రదేశ్కు తరలించారు.