న్యూఢిల్లీ : నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలపై టీఎంసీ ఎంపీలు గురువారం పార్లమెంట్ భవనం ఎదుట గాంధీ విగ్రహం వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఉల్లి, బంగాళదుంపల దండలను మెడలో వేసుకుని ప్రభుత్వాన్ని ఇంధన దొంగగా అభివర్ణిస్తూ రాసిన ప్లకార్డులను టీఎంసీ ఎంపీలు ప్రదర్శించారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులపై అధిక భారం పడుతోందని, ధరలను తక్షణమే ప్రభుత్వం తగ్గించాలని సీనియర్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలతో ఏ వస్తువు కొనాలన్నా సామాన్యుడిపై పెనుభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక షెడ్యూల్కు ఒక రోజు ముందే గురువారం పార్లమెంట్ ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ధరల మంటపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బుధవారం సైతం పెట్రోల్ ధరలు లీటర్కు 80 పైసలు పెరగ్గా తాజా పెంపుతో గడిచిన 15 రోజుల్లో ఇంధన ధరలు లీటర్కు రూ పది చొప్పున భారమయ్యాయి.