ఫేస్బుక్తో వలపు వల
అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు
కుదురుస్తానని డబ్బు వసూలు
బాధితుల ఫిర్యాదుతో ఒక్కొక్కటిగా వెలుగులోకి..
నల్లగొండలో అరెస్టు చేసిన పోలీసులు
నల్లగొండ రూరల్, మే 1: అమ్మాయిలకు పెండ్లి సంబంధాలు కుదురుస్తానని నమ్మబలుకుతుంది. ఆమె మాటలు నమ్ముతున్నారని తెలిసిన తర్వాత ఇక డబ్బులు గుంజడం మొదలు పెడుతుంది.. అమ్మాయిల తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోచుకుంటుంది. అంతేకాదు సోషల్ మీడియాలో అబ్బాయిలకు వల వేస్తుంది. వీడియో, టెక్స్ చాటింగ్లను స్క్రీన్షాట్స్ తీసి బ్లాక్మెయిల్ చేస్తుంది.. డబ్బు వసూలు చేస్తుంది.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగారు. సత్తుపల్లికి చెందిన ఈ కిలాడీ లేడి లీలలను నల్లగొండలోని వన్టౌన్ పోలీసులు బయటపెట్టారు. శనివారం ఆమెను అరెస్టు చేశారు. అక్కడి ఎస్పీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన పంతంగి మహేశ్వరి అలియాస్ ఇందు దాసరి అలియాస్ ధరణిరెడ్డి హైదరాబాద్లోని కొంపెల్లి చెందిన ఓ యువకుడికి కొన్నాళ్ల క్రితం మహేశ్వరి సోషల్ మీడియాలో పరిచయమైంది.
యువకుడు పోస్ట్ చేసిన ఫొటోలను అతనికి తెలియకుండా ఇతరులకు పంపిస్తూ పెళ్లి సంబంధాలు మాట్లాడింది. కొందరి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత యువకుడితో చేసిన చాటింగ్, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేసింది. భయపడిన సదరు యువకుడు అనేకసార్లు ఆమెకు డబ్బు ఇచ్చాడు. సామాజిక మాధ్యమాల ద్వారా అతని నుంచే కాక అతని స్నేహితులు, బంధువులకూ వల వేసి డబ్బులు అడిగింది. ఇక విసిగిపోయిన యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో ‘కిలేడీ’ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసును ఛేదిండానికి పోలీసులు రంగంలోకి దిగారు. అనేక కేసుల్లో నిందితురాలి కోసం వేట ప్రారంభించారు. మహేశ్వరి నల్లగొండలో నివాసం ఉంటుందని పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేశారు. అతి తక్కవ సమయంలో కేసులను ఛేదించిన నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గౌడ్, వన్టౌన్ సీఐ నిగిడాల సురేశ్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
u హైదరాబాద్ కూకట్పల్లిలో మరో యువకుడినీ ఇలాగే బ్లాక్ మెయిల్ చేసింది మహేశ్వరి. రూ.4.50 లక్షల వరకు వసూలు చేసింది. మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
u మరో ఘటనలో ఫేస్బుక్లో అబ్బాయి ఐడీతో ఘట్కేసర్కు చెందిన ఒక అమ్మాయితో మహేశ్వరి పరిచయం పెంచుకున్నది. చాటింగ్ ద్వారా ఆమెను ప్రేమ పేరుతో ఆకర్షించింది. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి 1.75 లక్షలు వసూలు చేసింది.
u ఖమ్మం జిల్లా వేంసూర్కు చెందిన ఓ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదురుస్తానని ఆమె తండ్రి నుంచి డబ్బులు వసూలు చేసింది మహేశ్వరి. తర్వాత మోసపోయామని తెలుసుకున్న బాధితులు వేంసూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలా అనేక విధాలుగా పలువురి నుంచి రూ.11.70 లక్షలు వసూలు చేసింది.