బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి… ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్న వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తూర్పురా బట్టారు. ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానంపై ట్విట్టర్ వేదికగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయ్ మాల్యా మొదలు తాజాగా జరిగిన ఏబీజీ షిప్యార్డు బాగోతం వరకూ ఉన్న అంశాలను ప్రస్తావిస్తూ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు.
‘విజయ్ మాల్యా 9000 కోట్లు, నీరవ్ మోదీ 14000 కోట్లు, రుషి అగర్వాల్ 23000 కోట్లు… నేడు అప్పుల బాధతో రోజుకు దేశంలో 14 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోట్లకు కోట్లు పడగలెత్తిన వీరి జీవితాలు మాత్రం శోభాయమానంతో తెగ వెలిగిపోతున్నాయి. ఇంతటి బలమైన ప్రభుత్వం.. వీరిపై బలమైన చర్యలు తీసుకోవాలన్నది మా భావన’ అంటూ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. అలాగే నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన రైతుల పట్ల కేంద్రం సరైన విధంగా స్పందించలేదని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్ డిమాండ్ చేశారు.