భోపాల్, సెప్టెంబర్ 3: ఫేమస్ కావాలని చాలా మంది యూట్యూబ్, ఇన్స్టాగ్రాంలో ఇటీవల పలు రకాల వీడియోలు చేస్తున్నారు. అయితే మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేమస్ అయ్యేందుకు ఏం చేశాడో తెలుసా.. ఆరు రోజుల్లో నలుగురిని హత్య చేశాడు. నిద్రపోతున్న సెక్యూరిటీ గార్డులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేశాడు. మూడు హత్యలు సాగర్ జిల్లాలో చేయగా, నాలుగో హత్య భోపాల్ జిల్లాలో చేశాడు. ఎట్టకేలకు ఈ సీరియల్ కిల్లర్ని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు కావడానికి కొద్ది గంటల ముందే నాలుగో హత్యచేశాడు. నిందితుడు 18 ఏండ్ల శివప్రసాద్ ధుర్వీ అలియాస్ హల్కు 8వ తరగతి మధ్యలోనే ఆపేశాడు. సాగర్ జిల్లాలోని కేక్రా గ్రామానికి చెందిన ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదని, ఎప్పుడూ చాలా కోపంగా ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. స్కూల్లో కూడా చిన్న గొడవలకే తోటి విద్యార్థులను తీవ్రంగా కొట్టేవాడని తెలుస్తున్నది. ఐదేండ్ల కిందట ఇంటి నుంచి పారిపోయి మహారాష్ట్రలోని పుణెలో ఓ హోటల్లో పనిచేసేవాడు. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి పోతుండేవాడు. చివరిసారిగా రాఖీ పండుగకు ఇంటికి వచ్చాడని అతడి తల్లి చెప్పింది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు త్వరలో తాను ఫేమస్ అయిపోతానంటూ వారికి చెప్పాడని ఆమె పేర్కొన్నది.