న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ ఈ నెల 30న నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పడాలంటే ఆ అభ్యర్థి పేరును దేశంలోని 50 మంది పార్టీ డెలిగేట్స్ ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో శశిథరూర్ ఐదు సెట్ల నామినేషన్ పేపర్స్ సిద్ధం చేసుకుని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ ప్రతినిధులను సంప్రదిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాహుల్గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దాంతో సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీ కోరినా రాహుల్గాంధీ నిరాకరించారు. దాంతో ప్రియాంక గాంధీ అధ్యక్ష పదవి చేపడుతుందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తమ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పదవి చేపట్టబోరని రాహుల్గాంధీ స్పష్టం చేశారు.
రాహుల్ ప్రకటనతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంబేతరులు చేపట్టడం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎంపీ శశిథరూర్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరికొందరు నేతల పేర్లు వినిపించినా చివరిగా ఈ ఇద్దరి పేర్లు మాత్రమే ఖరారయ్యే అవకాశం ఉన్నది. అక్టోబర్ 17న ఎన్నికలు జరుగనుండగా.. 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.