భోపాల్: మనుషుల్లో రానురాను మానవత్వం మంటగలిసిపోతున్నది. కొంతమంది చిన్నచిన్న కారణాలకు కూడా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కోడికూర వండలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తలపై కర్ర తగిలి తీవ్ర గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ నెల 23న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని సెమరియాటోల గ్రామానికి చెందిన కమ్లేష్ కోల్, రాంబాయ్ కోల్ ఇద్దరూ భార్యాభర్తలు. గత నెల 23న రాత్రి కమ్లేష్ కోడికూర తీసుకొచ్చి భార్యను వండమన్నాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరుగడంతో ఆగ్రహానికి లోనైన కమ్లేష్ కోల్ ఓ కర్ర తీసుకుని భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమై ప్రాణాలు కోల్పోయింది.
అయితే, ప్రమాదవశాత్తు తగిలిన గాయాలుగా చెప్పి అప్పట్లో ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే పోస్టు మార్టం రిపోర్టులో ఆమె తలపై కర్రతో బలంగా కొట్టిన గాయం ఉన్నట్లు తేలడంతో పోలీసులు రంగంలోకి దిగి కమ్లేష్ను తమదైన శైలిలో ఇంటరాగేట్ చేశారు. దాంతో జరిగిందంతా చెప్పాడు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు నిందితుడు కమ్లేష్ కోల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.