భోపాల్: ఒక కరోనా రోగి చనిపోయినట్లు ఆసుపత్రి సిబ్బంది రెండు సార్లు తప్పుగా చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా చివరకు అతడు బతికే ఉన్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఈ ఘటన జరిగింది. 58 ఏండ్ల గోరేలాల్ కోరి అనే వ్యక్తిని సోమవారం విదిషాలోని అటల్ బిహారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు కరోనాగా అనుమానించి పరీక్ష నిర్వహించారు. గోరేలాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం వెంటిలేటర్పై ఉంచారు. గురువారం ఆయన చనిపోయినట్లు కుమారుడు కైలాశ్కు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కొంత సేపటి తర్వాత గోరేలాల్ ఊపిరిపీల్చుతున్నారని నర్సు చెప్పింది.
మరోవైపు గోరేలాల్కు సర్జరీ చేయాలని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు దానికి సమ్మతించడంతో గురువారం శస్త్రచికిత్స చేశారు. అయితే సర్జరీ సందర్భంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని, దీంతో మ`తదేహాన్ని నేరుగా అప్పగించడం కుదరదని చెప్పారు.
గోరేలాల్ కుమారుడు తన తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆయన బతికే ఉన్నారని, ఆరోగ్యం విషమంగా ఉన్నదని వెంటిలేటర్పై ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. కాగా అప్పటికే రెండు సార్లు చనిపోయినట్లు చెప్పడంపై ఆ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు.
అయితే గందరగోళం వల్ల ఇలా జరిగిందని ఆసుపత్రి అధికారులు తెలిపారు. వెంటిలేటర్పై ఉన్న గోరేలాల్ గుండె ఆగిపోవడంతో వైద్యులు తమ ప్రయత్నం చేయడంతో గుండె కొట్టుకుంటున్నదని, ఇంతలో ఆయన చనిపోయినట్లుగా సిబ్బంది కుటుంబానికి చెప్పారని ఆసుపత్రి డీన్ డాక్టర్ సునీల్ నందేశ్వర్ వివరించారు.