భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం ( Road accident ) జరిగింది. ఓ వ్యాన్, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో 13 ఏండ్ల బాలిక, 14 ఏండ్ల బాలుడు ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని కిట్వారా బైపాస్ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకున్నది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాకు చెందిన 13 మంది (డ్రైవర్తో కలిపి 14 మంది) ఓ వ్యాన్లో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో గంగానది పుణ్యస్నానాలకు వెళ్లారు. అనంతరం స్వస్థలానికి తిరిగి వస్తుండగా రేవా జిల్లాలో వారి వ్యాన్, లారీ ఢీకొన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.