కోల్కతా, జూలై 29: టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం చార్జిషీట్ నమోదు చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల చార్జిషీట్లో ఆయన పేరు ఉండటం ఇదే మొదటిసారి. అక్రమ నియామకాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుజయ్ కృష్ణ భాద్రాకు యూత్ వింగ్కు చెందిన మరో నాయకుడు కుంతల్ ఘోష్ అందజేశాడని ఈడీ ఆరోపించింది. భాద్రా ఆర్థిక వ్యవహారాలతో అభిషేక్ బెనర్జీకి సంబంధముందని చార్జిషీట్లో పేర్కొన్నది. భాద్రాకు అభిషేక్ బెనర్జీకి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని తెలిపింది.
కలకత్తా హైకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు
ఓ భవనం అక్రమ నిర్మాణానికి సంబంధించి కేసు విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ నుంచి బుల్డోజర్లు కొనుగోలు చేయాల్సింది’…అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. కేంద్రంలో అధికార బీజేపీ మెప్పును పొందేందుకు జడ్జి ప్రయత్నిస్తున్నారని తృణమూల్ నాయకుడు కునాల్ ఘోష్ మండిపడ్డారు.