ముంబై: మహారాష్ట్ర పాలకుడు, యోధుడు చత్రపతి శివాజీపై ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై శివసేన రెబల్ నేత, సీఎం షిండే వర్గం ఎమ్మెల్యే ఎట్టకేలకు స్పందించారు. గవర్నర్ను మహారాష్ట్ర నుంచి పంపేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం దీనిపై సీరియస్గా స్పందించకపోతే రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు రావచ్చని హెచ్చరించారు. బుల్దానా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఈ మేరకు బీజేపీకి గట్టి సందేశం ఇచ్చారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలు ఎన్నటికీ పాత తరానికి చెందినవి కావని షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అన్నారు. ప్రపంచంలోని మరే ఇతర గొప్ప వ్యక్తితోనూ శివాజీని పోల్చలేరని, గవర్నర్ దీనిని అర్థం చేసుకోవాలని సూచించారు. ‘ఈ ప్రాంతం చరిత్ర, ఇక్కడ ఎలా పనిచేయాలో తెలియని గవర్నర్ లాంటి వ్యక్తిని ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే మరాఠీకి చెందిన వ్యక్తిని గవర్నర్ను చేయాలన్నది మా డిమాండ్. కోష్యారీని ఎక్కడికైనా పంపండి’ అని అన్నారు.
అలాగే ఈ సమస్యను పరిష్కరించకపోతే మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, షిండే వర్గం మధ్య విభేదాలు రావచ్చని సంజయ్ గైక్వాడ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సీనియర్ నేతలు దీనిపై దృష్టిసారించాలని ఆయన తెగేసి చెప్పారు.