న్యూఢిల్లీ, డిసెంబర్ 16: లఖింపూర్ ఖీరీ రైతుల హత్యకు బాధ్యతవహిస్తూ కేంద్రహోంశాఖ సహాయమంత్రి అజయ్మిశ్రా రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో బీజేపీ కొత్త పల్లవి అందుకున్నది. మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని తేల్చి చెప్పింది. కుమారుడు (ఆశిష్ మిశ్రా) చేసిన పనులకు.. తండ్రిని (అజయ్ మిశ్రా) శిక్షించడం సమంజసం ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నిస్తూ మంత్రిని వెనకేసుకొచ్చింది. ఈ మేరకు గురువారం పలు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘లఖింపూర్ ఖీరీ హింసాకాండపై అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాపై అభియోగాలు ఉన్నాయి. కేసు కోర్టులో ఉన్నది. ఆశిష్ తండ్రి అజయ్ను ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ మంత్రివర్గం నుంచి తొలగించాలనడం అర్థంలేని డిమాండ్’ అని బీజేపీ నాయకత్వం పేర్కొన్నట్టు మీడియా వెల్లడించింది. అయితే విలేకర్లపై మంత్రి అలా అనుచితంగా ప్రవర్తించాల్సింది కాదని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డట్టు వివరించింది.
లఖింపూర్ ఖీరీ ఘటనపై గురువారం పార్లమెంట్ అట్టుడికింది. ప్రతిపక్షాలు లోక్సభ స్పీకర్ పొడియం దగ్గరకు దూసుకెళ్లి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కేంద్రమంత్రిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రిని ఓ క్రిమినల్గా అభివర్ణిస్తూ.. ఆయన్ని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.