Early Monsoon | అన్నదాతలకు తీపి కబురు.. వ్యవసాయ ఆధారిత దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతు పవనాలు ముందే పలుకరించబోతున్నాయి. ఈ నెల 27నే కేరళ కోస్తా తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళను నైరుతి రుతు పవనాలు తాకుతాయి. కానీ ఈ దఫా నాలుగు రోజుల ముందే తాకుతాయని తెలుస్తున్నది. మే నెలలోనే నైరుతి రుతు పవనాలు భారత్ను తాకడం ఐదేండ్లలో తొలిసారి అని చెబుతున్నారు. ఇంతకుముందు జూన్కు ముందే 2017లో భారత్ తీరాన్ని నైరుతి రుతు పవనాలు తాకాయి.
వాయవ్య భారతంలో కొన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్న తరుణంలో ముందస్తుగా నైరుతి రుతు పవనాలు వస్తుండటం గమనార్హం. ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మరో అడుగు ముందుకేసి 26నే భారత్ను రుతు పవనాలు తాకుతాయని పేర్కొన్నది. అయితే, భారత తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకినా.. దేశవ్యాప్తంగా విస్తరిస్తాయా? అన్న సందేహాలు ఉన్నాయి. సకాలంలో వర్షాలు కురిస్తే పంటలు బాగా పండే పశ్చిమ, ఉత్తర, మధ్య భారతంలో వానాకాలం పంటు పుష్కలంగా పండుతాయి.
ఇప్పుడిప్పుడే వేసంగి కాలం ముగిసి పంటల విక్రయంతో డబ్బు చేతిలో ఉన్న రైతులకు ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిస్తే పంటల విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే మరో రెండు రోజుల్లో అంటే ఈ నెల 15 నాటికే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. రుతు పవనాల రాకతోనే దేశంలో వర్షాకాలం సీజన్ మొదలైనట్లే. సగం మందికంటే ఎక్కువగా వ్యవసాయ భూములు వర్షాధారమే. జూన్-సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలపైనే సగానికి పైగా పంటల సేధ్యం ఆధార పడి ఉంటుంది.