Monsoon : దేశంలో భగభగ మండుతున్న ఎండల (Heat wave) నుంచి త్వరలో ఉపశమనం లభించనుందని భారత వాతావరణ కేంద్ర (IMD) తెలిపింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఈసారి ముందుగానే వచ్చే అవకాశం ఉందని, ఈ నెల 14 నుంచి 16 మధ్య రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది సాధారణ సమయం కంటే కొంత ముందేనని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
నైరుతి రుతుపవనాలు ముందే రానుండటంతో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాల్లో, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని ఐఎండీ చెప్పింది. అయితే ఈ సారి మే నెలలో పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లోనూ వేడి ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా లేదా అంతకంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో సముద్రపు తేమతో కూడిన వేడి గాలులవల్ల ఎక్కువ ఉక్కపోత ఉంటుందని ఐఎండీ తెలిపింది.