న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశ ప్రజలను త్వరలోనే చల్లటి రుతు పవనాలు పలుకరించనున్నాయి. నైరుతి రుతు పవనాలు వేగంగా ఏర్పడుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉపగ్రహాలు పంపిన ఛాయాచిత్రాల ప్రకారం దట్టంగా ఏర్పడిన రుతుపవన మేఘాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఆవరించాయి.
తద్వారా నైరుతి రుతుపవనాలు కేరళ వైపు కదులుతూ వేగంగా బలపడుతున్నాయి. దీని కారణంగా అనుకున్న సమయానికే కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయని చెప్పారు. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా తీసిన ఇన్సాట్-3డీఎస్ థెర్మల్ ఇన్ఫ్రారెడ్ ఉపగ్రహ చిత్రాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. శ్రీలంక, ఆగ్నేయ అరేబియా సముద్రంలో దట్టమైన మేఘాల సమూహం అలుముకుందని, కేరళలో రుతుపవనాలకు ఈ రెండు ప్రాంతాలు చాలా కీలమని అధికారులు తెలిపారు.