ముంబై: ఒకవైపు కాస్త జాగా కోసం మనుషులు ఆరాటపడుతుంటే మరోవైపు ఏకంగా కోతుల పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. సంబంధిత ల్యాండ్ డాక్యుమెంట్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో ఈ వింత సంఘటన వెలుగుచూసింది. ఉప్లా గ్రామస్తులు కోతులకు ఎంతో విలువ ఇస్తారు. ఇంటికి వచ్చిన కోతులకు ఆహారం ఇవ్వకుండా తిప్పిపంపరు. అలాగే వివాహం వంటి వేడుకల సందర్భంగా కోతులను ప్రత్యేకంగా గౌరవిస్తారు. వాటికి తొలి కానుక ఇచ్చిన తర్వాతే పెళ్లి తంతు ప్రారంభిస్తారు.
కాగా, అంతగా కోతులను ఆదరించే ఈ గ్రామంలో ఏకంగా వాటి పేరుతో 32 ఎకరాల భూమి ఉంది. ఆ గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ స్వయంగా ఈ విషయాన్ని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆ భూమి కోతులకు చెందినట్లుగా పత్రాల్లో స్పష్టంగా ఉందని చెప్పారు. కోతుల పేరుతో భూమిని ఎవరు రిజిష్టర్ చేశారో తెలియదని అన్నారు.
మరోవైపు కోతులకు చెందిన ఆ భూమిలో అటవీశాఖ అధికారులు చెట్లు నాటినట్లు గ్రామ సర్పంచ్ బప్పా పడ్వాల్ తెలిపారు. ఆ స్థలంలో ఒక పాడుబడిన ఇల్లు కూడా ఉందన్నారు. తమ గ్రామంలో సుమారు వంద వరకు కోతులు ఉండేవని, అయితే రానురాను వాటి సంఖ్య చాలా తగ్గిందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.