భోపాల్: ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి టవల్లో మూటగట్టిన లక్ష డబ్బులను ఒక కోతి లాక్కొనిపోయింది. సమీపంలోని చెట్టు పైకి ఎక్కి టవల్ను విదిలించగా ఆ డబ్బులన్నీ కిందకు రాలాయి. దీంతో దొరికిన నోట్లను కొందరు తమ జేబులో వేసుకోగా చివరకు రూ.56 వేలు మాత్రమే ఓనర్కు దక్కాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని కటవ్ ఘాట్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న లక్ష నగదును టవల్లో చుట్టి ఉంచాడు. ట్రాఫిక్ జామ్ కావడంతో ఒక చోట ఆటో ఆగింది. ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ఆటోలోని ముగ్గురు వ్యక్తులు దిగి చూశారు. ఇంతలో ఒక కోతి ఆటోలో డబ్బులు చుట్టి ఉన్న టవల్ను ఎత్తుకుపోయింది. ఒక చెట్టుపైకి చేరిన అది, అందులో ఆహారం ఉందనుకుని టవల్ను విదిలించింది. దీంతో అందులో చుట్టి ఉంచిన కరెన్సీ నోట్లు గాల్లో ఎగిరి ఆ పరిపర ప్రాంతంలో పడ్డాయి.
కాగా, దారినపోయే వారు కొందరు దొరికిన కొంత నగదును తీసుకొని పోయారు. మరి కొందరు రోడ్డుపై పడిన నోట్లను సేకరించడంలో యజమానికి సహకరించారు. దీంతో చివరకు లక్షకు గాను రూ.56 వేలు ఆ వ్యక్తికి తిరిగి దక్కాయి.
ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. అయితే ఆ ప్రాంతంలో సీసీటీవీలు లేకపోవడంతో మిగతా డబ్బు ఎవరు తీసుకున్నారు అన్నది తెలియలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయలేదు.