తెలుగుయూనివర్సిటీ, ఏప్రిల్ 5: 75ఏండ్ల స్వాతంత్ర అమృత్ ఉత్సవాలు దేశ వ్యాప్తంగా జరగడం వల్ల ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని రగిలిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ రమణాచారి అన్నారు. ఆకృతి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర అమృత్ ఉత్సవాలు, జాతీయ పతాకం వంద సంవత్సరాల ఉత్సవం ఏసీగార్డ్స్లోని రమణాచారి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 95సంవత్సరాల స్వాతంత్య్ర సమరమోధుడు హుస్సేన్ అయ్యర్ను సత్కరించారు. దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వరాజ్యం ఎందరో త్యాగధనుల పుణ్యఫలం వల్ల సాధ్యమైందని రమణాచారి గుర్తు చేశారు. బీసీ కమిషన్ పూర్వ సభ్యులు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రమణాచారి సారథ్యంలో అమృత్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆకృతి సుధాకర్, ఎస్.రాంచందర్, ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.