భోపాల్, డిసెంబర్ 11: మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకొన్నది. ఎవరూ ఊహించని విధంగా, గత వారం రోజులుగా అసలు సీఎం రేసులోనే లేని ఓబీసీ నేత మోహన్ యాదవ్ను రాష్ర్టానికి నూతన సీఎంగా ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం భోపాల్లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఉజ్జయిని(దక్షిణ) ఎమ్మెల్యేగా ఉన్న మోహన్ యాదవ్ను పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకొన్నారు. నాలుగు సార్లు రాష్ర్టానికి సీఎంగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి కీలక నేతలను పక్కనపెట్టి మరీ ముఖ్యమంత్రిగా బీజేపీ మోహన్ యాదవ్ను ఎంపిక చేయడం రాజకీయ వర్గాలనే కాదు పార్టీ వర్గాలను కూడా ఆశ్చర్యపరిచింది. మోహన్ యాదవ్ ప్రస్తుతం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయనకు రాష్ట్రీయ స్వయం సేవక్(ఆరెస్సెస్) కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నది. శాసనసభా పక్ష నేత ఎన్నిక సమావేశానికి ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులుగా హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా నేత కే లక్ష్మణ్, పార్టీ కార్యదర్శి ఆశా లక్రా హాజరయ్యారు. తనను సీఎంగా ఎంపిక చేయడంపై మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక చిన్న స్థాయి పార్టీ కార్యకర్తను అయిన తనకు ఈ అవకాశం ఇచ్చిందుకు అయన బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతన సీఎంగా ఎంపికైన మోహన్ యాదవ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, సింధియా, ఇతర నేతలు శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా మోహన్ యాదవ్ పేరును సమావేశంలో చౌహానే ప్రతిపాదించడం గమనార్హం.
ప్రముఖ నేతలను పక్కకు నెట్టి..
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎవరి పేరును ప్రకటించలేదు. దీంతో ప్రస్తుతం సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అప్పట్లోనే పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సీఎం పదవి చేపట్టాలని తన వంతు ప్రయత్నాలు చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా సీఎం కుర్చీ కోసం పావులు కదిపారు. ఇందుకు అనుగుణంగానే సీఎం రేసులో చౌహాన్, సింధియా, తోమర్, ప్రహ్లాద్ పటేల్ సహా పలువురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే వారందరినీ బీజేపీ అధిష్ఠానం పక్కనపెట్టి రేసులో అసలు పేరే వినిపించని, కొత్త వ్యక్తికి సీఎంగా అవకాశం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకొన్నది.
స్పీకర్గా నరేంద్ర సింగ్ తోమర్
అసెంబ్లీ కొత్త స్పీకర్ విషయంలోనూ బీజేపీ ఎంపిక ఆశ్చర్యకరంగా ఉన్నది. సీఎం రేసులో పేరు వినిపించిన కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను స్పీకర్గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న మోహన్ యాదవ్కు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. రేవా నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లా, మాజీ మంత్రి జగదీశ్ దేవరాలకు బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించింది.
విద్యార్థి నాయకుడి నుంచి సీఎం స్థాయి దాకా..
58 ఏండ్ల మోహన్ యాదవ్ 2013లో ఎమ్మెల్యేగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2018లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2020, జూలైలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై దాదాపు 13 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వ్యాపారవేత్త కూడా అయిన మోహన్ యాదవ్ బీజేపీతో చాలా ఏండ్లుగా అనుబంధం ఉన్నది. గతంలో విద్యార్థి నేతగా కూడా పనిచేశారు.