న్యూఢిల్లీ : భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దాలని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లో సోమవారం జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్ఠను సాధించేందుకు.. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు ఉన్న ప్రాచీనత, సత్యాన్ని స్థాపించాలని, తద్వారా ప్రజలు విశ్వసిస్తారని, దీన్ని మేథావులు నిరూపించాలన్నారు. వాటిని భవిష్యత్ పాఠ్య పుస్తకాల్లో ఆధారాలతో సహా పేర్కొనాలన్నారు.
రామసేతు గురించి మాట్లాడే సమయంలో.. అపోహగా భావించే వారని, కానీ ఆధారాలు తెరపైకి వచ్చాయన్నారు. మన విద్యా విధానం విశ్వాసాన్ని పెంపొందించడం లేదని.. సరస్వతీ నది ఉందని, నేటికీ ఉందని ఓ వర్గం ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. మన కొత్త తరం రుజువును కోరుతుందని, మన విద్యా విధానం విశ్వాసాన్ని ప్రోత్సహించకపోవడమే ఇందుకు కారణమన్నారు. కొత్త విధానంతో ఇది ఎంత వరకు మారుతుందో చూడాలన్నారు. కానీ, ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యవస్థ విద్యార్థులను ప్రతిదాన్ని.. ప్రశ్నించే స్థితికి తీసుకెళ్తుందని.. మన వారసత్వాన్ని నమ్మకుండా చేస్తుందన్నారు.
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి మాట్లాడుతూ కొందరు ఉనికిని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారని.. ఎందుకిలా చేస్తున్నారని తనకు ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అందరికీ సంస్కృతం బోధించాలనే ప్రయత్నంలో తనపై చాలా ఆరోపణలు వస్తాయన్నారు. మేధావులుగా పిలువబడే ఓ వర్గం ఎల్లప్పుడూ మన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తుందన్నారు.