పొద్దున లేస్తే మమ్మల్ని మించిన దేశభక్తులు లేరని కాలరెగరేస్తుంటారు.. తాము అధికారంలోకి వచ్చాక దేశానికి శత్రుభయం పూర్తిగా తగ్గిపోయిందని గొప్పలు చెప్తుంటారు.
ఇన్నాళ్లూ మనకు కావాల్సిన ఆయుధాలు బయటి దేశాల నుంచి కొని తెచ్చుకొన్నామని.. ఇక నుంచి మనమే సొంతంగా తయారు చేసుకొంటామంటూ ఎంతో ఆర్భాటంగా ‘మేకిన్ ఇండియా’ అని ఓ పథకాన్నీ తెచ్చారు.
ఇప్పుడు ఈ పథకమే దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నది. చైనా, పాకిస్థాన్ నుంచి ప్రమాదం పెరిగిపోతున్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ ముందుచూపులేని నిర్ణయాలు భారత రక్షణ సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి.
8 ఏండ్ల కింద తెచ్చిన పథకం కింద ఇప్పటికీ ఒక్క బోల్టు కూడా తయారుచేయకపోవటం తో త్రివిధ దళాలకు అత్యంత కీలకమైన యుద్ధ విమానాలు, ఆయుధాలు, హెలికాప్టర్ల కొరత అంతకంతకూ తీవ్రమవుతున్నది.
మోదీ నిర్ణయంతో నష్టమే
– రాహుల్ భేడీ, రక్షణరంగ
విశ్లేషకుడు, జర్నలిస్ట్, న్యూఢిల్లీ
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధించాలంటే లక్షల కోట్ల పెట్టుబడితోపాటు ఏండ్లపాటు పరిశోధనలు అవసరం. సున్నితమైన అంశాల్లో ముందూ, వెనుకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే నష్టమే ఎక్కువ. ‘మేకిన్ ఇండియా’ స్కీం రక్షణ రంగానికి ఆపాదించడం ఇప్పటికిప్పుడు సరైన చర్య అనిపించుకోదు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ) : 2014లో మోదీ అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని ప్రకటించారు. సెల్ఫోన్ మొదలు అత్యాధునిక యుద్ధ విమానాల వరకు అన్నీ మనదేశంలోనే సొంతంగా తయారు చేస్తామని, భారత్ను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారుస్తామని గొప్పగా చెప్పారు. దేశీయ ఉత్పత్తిరంగాన్ని ప్రోత్సహించేందుకు అత్యంత కీలకమైన ఆయుధ వ్యవస్థల దిగుమతులను కూడా నిలిపేశారు. కొన్నింటిని దిగుమతి చేసుకొన్నా.. వాటికి అవసరమయ్యే పరికరాల్లో సగం మనదేశంలోనే తయారుచేయాలని షరతు పెట్టారు. ఇప్పటికి ఎనిమిదేండ్లు గడిచిపోయాయి. ఒక్కటంటే ఒక్క కొత్త ఆయుధాన్నీ తయారు చేయలేదు. బయటి నుంచి దిగుమతి చేసుకోవటంలేదు. దీంతో మన సైనికులు తుప్పుపట్టిన ఆయుధాలే పట్టుకొని తిరగాల్సి వస్తున్నది. ఎప్పుడు కూలిపోతాయో తెలియని విమానాలు, హెలికాప్టర్లతోనే ఎయిర్ఫోర్స్, సైన్యం నెట్టుకొస్తున్నాయి.
2030 నాటికి ఎయిర్ఫోర్స్ ఖాళీ
నేటి యుద్ధ తంత్రంలో యుద్ధవిమానాలు, బహుళ ప్రయోజనకర హెలికాప్టర్లదే కీలకపాత్ర. భారతదేశం ఇప్పటివరకు తేజస్ పేరు తో తేలికపాటి సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాన్ని మాత్రమే తయారుచేయగలిగింది. అవి కూడా మన అవసరాలకు సరిపడా ఉత్పత్తి కావటంలేదు. అత్యవసరంగా మనం విదేశాల నుంచి కొనుగోలు చేసే యుద్ధవిమానాలు, హెలికాప్టర్లలో సగం మనదేశంలోని పరికరాలను వాడాలని కేంద్రం మేక్ ఇన్ ఇండియా పాలసీలో షరతు పెట్టింది. చాలా కంపెనీలు అందుకు ఒప్పుకోకపోవటంతో హెలికాప్టర్లు, యుద్ధ విమానాల కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని బ్లూమ్బర్గ్ మీడి యా సంస్థతో పలువురు త్రివిధ దళాల అధికారులు తెలిపారు. భారత ఎయిర్ఫోర్స్ వద్ద ప్రస్తుతం 42 ఫైటర్ స్కాడ్రన్లు ఉన్నాయి. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 18 ఫైటర్ జెట్లు ఉంటాయి. ప్రస్తుత పాలసీ వల్ల 2030 నాటికి స్కాడ్రన్ల సంఖ్య 30కి పడిపోవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ స్వదేశీ తేజస్ విమానాలను తయారు చేస్తున్నది. కానీ ఈ సంస్థకు ఏటా 8 విమానాలు తయారు చేసే సామర్థ్యం మాత్రమే ఉన్నది. అంటే ఈ సంస్థ ఏడాది మొత్తం కష్టపడినా సగం స్కాడ్రన్ కూడా తయారు చేయలేదు.
డొక్కు హెలికాప్టర్లే గతి
భారతదేశానికి అత్యంత సమస్యాత్మక సరిహద్దు అత్యధికం హిమాలయాల్లోనే ఉన్నది. అక్కడ గస్తీ కాయటం కత్తిమీద సాము వంటిది. చాలాచోట్లకు సైనికులకు సరుకులు చేరవేయటానికి తేలికపాటి హెలికాప్టర్లే గతి. ప్రస్తుతం మన సైన్యం వాడుతున్న హెలికాప్టర్లు 1970ల నాటివి. వీటికి ఎన్నడో కాలం చెల్లినా కొత్తవి లేకపోవటంతో వాటినే వాడుతున్నారు. దీంతో 2017 నుంచి ఈ హెలికాప్టర్ల ప్రమాదంలో 30 మంది సైనికులు మరణించారని, 19 మంది గాయపడ్డారని కేంద్రప్రభుత్వమే పార్లమెంటుకు తెలిపింది. 2026 నాటికి ఈ హెలికాప్టర్లన్నింటినీ పక్కనపెట్టాల్సిందేనని మిలిటరీ అధికారులు తెలిపారు. అంటే ఇప్పుడు అత్యవసరంగా సైన్యానికి హెలికాప్టర్లు, ఎయిర్ఫోర్స్కు ఫైటర్ జెట్లు కావాలి.
దేశీయ ఉత్పత్తి ఏది?
మేక్ ఇండియాలో భాగంగా అంతర్జాతీయ మిలిటరీ హార్డ్వేర్ కంపెనీలను ఇండియాకు రప్పించి, ఇక్కడే అత్యాధునిక విమానాలు, ఆయుధాలు తయారుచేస్తామని కేంద్రం 2014లో ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్క హెలికాప్టర్ను తయారుచేయలేదు. ప్రస్తుతం మనం వాడుతున్నవాటిలో అత్యధికం సింగిల్ ఇంజిన్ చాపర్లు. వాటిని ప్రపంచంలోని చాలా దేశాలు ఎన్నడో పక్కనపెట్టి డబుల్ ఇంజిన్ చాపర్లు వాడుతున్నాయి. మనదేశంలో డబుల్ ఇంజిన్ చాపర్లు తయారుచేయటానికి ఇంకా దశాబ్దాలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. నేవీకి అవసరమైన డీజిల్-ఎలక్ట్రిక్ సబ్మెరైన్లను దేశీయంగానే తయారుచేస్తామని కేంద్రం అప్పట్లో ప్రకటించింది. వాటి ఉత్పత్తి కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆయుధాల కొరత వేధిస్తుండటంతో త్రివిధ దళాల అధినేతల్లో ఆందోళన పెరిగిపోతున్నది. మోదీ విధించిన ఆయుధాల దిగుమతి షరతులను పక్కనపెట్టయినా అత్యవసరంగా కీలక ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేయాలని రక్షణశాఖను వారు కోరారని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.