న్యూఢిల్లీ, ఆగస్టు 20: సాధారణంగా ప్రభుత్వాలు అమలుచేసే పథకాల గురించి ప్రజలకు తెలియజేసేందుకు పత్రికాప్రకటనలు ఇస్తుంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా తమ ఘనతను చాటి చెప్పుకొనేందుకు ఇటీవల కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 24 లక్షల మందికి ఇండ్లు ఇచ్చినట్టు అందులో పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు ధన్యవాదాలు. అదృష్టవశాత్తు ఈ పథకం కింద నాకో సొంతిల్లు లభించింది’ అని ఓ మహిళ కృతజ్ఞత చెబుతున్నట్టు ఆమె ఫొటో అచ్చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ ఫొటోలో ఉన్న లక్ష్మీదేవి అనే మహిళను నేరుగా కలిసి ఇల్లు గురించి ప్రశ్నించగా.. ఆ ప్రకటనలో ఉన్న ఫొటో తనదేనని, అయితే దాన్ని ఎప్పుడు తీశారో కూడా తనకు తెలియదని పేర్కొన్నది. మరి ప్రకటనలో చెప్పినట్టు ఇల్లు వచ్చిందా అని అడగ్గా.. ఇల్లూ లేదు ఏమీ లేదని సమాధానం ఇచ్చింది. నెలకు 500 అద్దె కింద చిన్నపాటి ఇంట్లో తలదాచుకుంటున్నామని వాపోయింది. తమకు ఇంకా సొంత ఇల్లు లేదని చెబుతున్నది. మోదీ మాటలు పూర్తిగా అబద్ధాలని (ఝూటా బాత్) పేర్కొన్నది.