PM Modi | న్యూఢిల్లీ, ఆగస్టు 19: ‘భారత దేశ ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా ఉంది.. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల విచ్ఛిన్నమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పార్లమెంట్లో జవాబుదారీతనం లోపించింది.‘ అంటూ కొందరు మేధావులు మన దేశంపై తమ అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా? మానవ హక్కుల రక్షణ అమలవుతున్నదా? దేశంలోని ఆర్థిక, సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై అమెరికాకు చెందిన జర్నల్ ఆఫ్ డెమోక్రసీ ప్రముఖ విశ్లేషకుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. 1990లో స్థాపించిన ఈ జర్నల్ ‘భారత్ ఇంకా ప్రజాస్వామిక దేశమేనా?’ అనే అంశంపై ఇటీవల వరుసగా వ్యాసాలు ప్రచురిస్తూ వస్తున్నది. అందులో భాగంగా ఐదుగురు మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 2014లో మోదీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజాస్యామ్యం ఇబ్బందులు పడుతున్నదని కొందరు అభిప్రాయపడ్డారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మయా ట్యూడర్, చరిత్రకారుడు త్రిపురదామన్ సింగ్, అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ రాహుల్ వర్మ, ఇండియానా యూనివర్సిటీ ప్రొఫెసర్లు వినీత యాదవ్, సుమిత్ గంగూలి.. భారతలో దిగజారుతున్న పరిస్థితులు, అందులో బీజేపీ పాత్ర గురించి వివరించారు.
1975 ఎమర్జెన్సీతో పోలిస్తే ప్రస్తుతం భారత్లోని పరిస్థితులు ఊహించిన దానికన్నా మెరుగ్గా ఉన్నాయని డాబ్సన్, మసౌద్ అభిప్రాయపడ్డారు! బీజేపీ అధికారంలోకి వచ్చింది మొదలు (2014 తర్వాత) ప్రజాస్యామ్య వ్యవస్థలను మూకుమ్మడిగా విచ్ఛిన్నం చేయడంలో నిమగ్నమై ఉన్నట్టు విమర్శించారు. భారత్లో ప్రజాస్వామ్యం కేవలం ఆ దేశ పౌరులకే కాదు.. ప్రపంచ ప్రజాస్వామ్య ఉద్యమాలకు అవసరమన్నారు.
ప్రజాస్వామ్యాన్ని నిర్వర్తించాలంటే ఎన్నికలకు అతీతంగా చూడాలని మాయా ట్యూడర్ తన వ్యాసం ‘వై ఇండియాస్ డెమోక్రసీ డైయింగ్’లో అభిప్రాయపడ్డారు. భారత్లో ప్రజాస్వామ్యం దిగజారిందన్నారు. విమర్శకుల నోరు నొక్కేయడానికి వారిపై రాజద్రోహ చట్టాలు ప్రయోగించడం, న్యాయవ్యవస్థను అచేతనంగా మార్చడం, పార్లమెంట్లో జవాబుదారీ వహించకపోవడాన్ని ఆమె ఎత్తిచూపారు. విపక్షాలు పటిష్టంగా ఉంటే ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని చెప్పారు.
భారత్లోని ప్రజాస్వామ్య పరిస్థితులను పశ్చిమ దేశాలతో పోల్చరాదని సింగ్ రాహుల్వర్మ, త్రిపుర్దమన్ సింగ్ పేర్కొన్నారు. యూపీ లాంటి రాష్ర్టాల్లోని నేరాలు, రాజకీయ పరిస్థితులు, దేశంలో పౌరుల హక్కులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రజాస్యామ్య మరణానికి సంబంధించి వాదనలు పూర్తిగా అతిశయోక్తి అని ఆయన వాదించారు. ఆందోళనకు కారణాలు ఉన్నప్పటికీ ఇటీవల మారిన ఆధిపత్య పార్టీ వ్యవస్థ లక్షణాలను మాత్రమే మనం భారత్లో చూస్తున్నామని అన్నారు. గతంలో దేశాన్ని పాలించిన ప్రధానులను నిందించలేమన్నారు.