Modi Surname Row | పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై శనివారం గుజరాత్ హైకోర్టులో శనివారం విచారణ జరిగింది. జస్టిస్ హేమంత్ ఎం ప్రచ్చక్ కేసును విచారిస్తున్నారు. కాంగ్రెస్ నేత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ పూర్ణేష్ మోదీ పేరును ఎత్తలేదని, ‘మోదీ’ పేరు ఏ గుర్తింపు పొందిన జాతికి చెందిందని కాదన్నారు. ఒకే పేరుతో కోట్లాది మంది ఉంటే.. అందరిపైనా కేసు నమోదు చేయలేరన్నారు. పిటిషనర్ ఇంటి పేరుతో దేశంలో కోట్లాది మంది ఉన్నారని, ఒక్క స్టేట్మెంట్పై కోట్లాది మంది కేసు పెట్టగలరా? అని ప్రశ్నించారు.
గుజరాత్లో మోదీ ఇంటిపేరును మోద్, వానిక్, రాథోడ్, తెలీ పేరుతో చాలా మంది రాస్తారని, వాటన్నింటితో రాహుల్ వ్యాఖ్యలకు ముడిపెట్టడం సరికాదన్నారు. దేశంలోని 13కోట్ల మంది ప్రజల పరువు తీశారని పిటిషన్ ఆరోపిస్తున్నారని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనన్న ఆయన.. దీన్ని అనుతించకూడదన్నారు. నరేంద్ర మోదీ, నీరవ్ మోదీ, లలిత్ మోదీ అందరివీ వేర్వేరు కులాలని సింఘ్వీ పేర్కొన్నారు. రాహుల్ తన వ్యాక్యలో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ పేర్లను సైతం ప్రస్తావరించారని, తన కులాన్ని అవమానించారని పూర్ణేశ్ మోదీ ఎలా చెప్పగలరని ప్రశ్నించారు.
పూర్ణేష్ మోదీ అసలు ఇంటిపేరు భూత్వాలా అని హైకోర్టుకు తెలిపారు. రాహుల్ ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించిందని, అయితే సుప్రీంకోర్టు తీర్పు నవంబర్ 2019 నాటిదన్నారు. ఇప్పుడు రాహుల్ను దోషిగా నిర్ధారించిన వ్యాఖ్యలకు ఏప్రిల్ 2019 నాటివన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను 7 నెలల వెనక్కి తీసుకోవడం ద్వారా ఎలా అమలు చేస్తారని, మేజిస్ట్రేట్ కోర్టు చేసిన తప్పును సెషన్స్ కోర్టులో ప్రస్తావించినా.. వినిపించుకోలేదన్నారు. వాస్తవానికి అలాంటి కేసులో మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేయకూడదని, నేరారోపణను మినహాయించాలని సంఘ్వీ అన్నారు.
ఈ కేసును అంగీకరించకూడదన్నారు. నేరుగా వినలేదని ఫిర్యాదుదారుడు పేర్కొంటున్నారని, వాట్సాప్లో ఎవరో ఆయనకు పంపారని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని పూర్ణేష్ మోదీని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కర్ణాటక కోలార్లో జరిగిన సభలో మోదీ ఇంటిపేరు పేరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పటి గుజరాత్ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ మెజిస్ట్రేట్ కోర్టులో పరువునష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో మార్చి 23న రాహుల్కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్ను తిరస్కరించింది. ఈ క్రమంలో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.