Manipur Roits | ఇంఫాల్/తౌబాల్, జూన్ 21: దాదాపు 50 రోజులుగా హింసాత్మక ఘటనలతో మణిపూర్ మండిపోతుంటే.. దేశ ప్రధానిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మోదీ మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మణిపూర్ వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొని, వారిని రోడ్లపైకి వచ్చేలా చేసింది. బుధవారం యోగా డేను బహిష్కరిస్తూ.. తౌబాల్ జిల్లాలోని తౌబాల్ మేలా మైదానంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వేలాది సంఖ్యలో మణిపూర్ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షోభానికి పరిష్కారం చూపని కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రధాని మోదీతో పాటు అమిత్షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్రానికి, మోదీ మౌనానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. శాంతి, సామరస్యం అంటూ ప్రపంచానికి పాఠాలు చెప్పే మోదీకి.. మణిపూర్లో నెలకొన్న అశాంతి కనిపించడం లేదా? అని రిజోరియో ఓక్రమ్ అనే ఆందోళనకారుడు ప్రశ్నించాడు.
నిర్లక్ష్యానికి నిదర్శనం
రాష్ట్రంలో హింస ప్రారంభమై 50 రోజులు అయిందని, ఈ మధ్యలో రెండుసార్లు నిర్వహించిన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ మణిపూర్ గురించి మాట్లాడకపోవడంపై నిరసనకారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మణిపూర్లో శాంతి నెలకొల్పాలని కోరుతూ రాజధాని ఇంఫాల్లో పోలో క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. కేవలం ఎన్నికల సమయంలోనే మోదీకి మణిపూర్ గుర్తొస్తుందా? అని పీఏఎల్ కార్యదర్శి జిబన్కుమార్ ప్రశ్నించారు. కాగా, మణిపూర్ అంశంపై జూన్ 24న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం బుధవారం తెలిపింది.
మిజోరం బడులకు మణిపూర్ విద్యార్థులు
రాష్ర్టానికి చెందిన 1500 మందికి పైగా విద్యార్థులు పొరుగున ఉన్న మిజోరం రాష్ట్రంలోని పాఠశాలల్లో చేరారు. వీరందరికీ ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చినట్టు మిజోరం విద్యాశాఖ డైరెక్టర్ లాల్సాగ్లింయానా తెలిపారు.
దేశ పరిస్థితిపై దృష్టి పెట్టాలి
మోదీ మౌనంపై విపక్షాలు మండిపడుతున్నాయి. 45 రోజులకు పైగా మణిపూర్ హింసతో మండిపోతుంటే, అధికారంలో ఉన్నవారికి పరిస్థితులను చక్కదిద్దే సమయం లేదా? అని ఎన్సీపీ నేత శరద్పవార్ ప్రశ్నించారు. విదేశీ పర్యటనలు చేస్తున్న మోదీ.. ముందు దేశంలోని అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.రాష్ట్రంలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కాగా, రాష్ట్రంలోని తాంగ్జింగ్, కంగ్చుప్ ఏరియాల్లో మంగళవారం రాత్రి కాల్పుల ఘటనలు చోటుచేసుకొన్నాయి. తాంగ్జింగ్ ఏరియాలోని సుగ్నుకు సమీపంలో దాదాపు 15-20 రౌండ్ల కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో ఎవరూ మరణించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు.