న్యూఢిల్లీ: బీజేపీ ఫైర్బ్రాండ్ సుబ్రమణ్యన్ స్వామి దేశంలో కరోనా కట్టడికి కీలక సూచన చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయంపై ఆధారపడటం దండుగ కానీ.. కరోనా నిర్వహణ బాధ్యతలు మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించండి అని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. బుధవారం ఉదయాన్నే ఆయన ఓ ట్వీట్ చేశారు. ముస్లిం చొరబాటుదారులు, బ్రిటీష్ సామ్రాజ్యవాదులను ఎదురించి నిలిచినట్లే ఇండియా కరోనా మహమ్మారిపై కూడా విజయం సాధిస్తుంది. ఇప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలను లక్ష్యంగా చేసుకునే మరో కరోనా వేవ్ను మనం చూడాల్సి వస్తుంది. అందుకే మోదీ ఈ కరోనాపై పోరు బాధ్యతలను వెంటనే గడ్కరీకి అప్పగించాలి. పీఎంవోపై ఆధారపడటం దండగ అని స్వామి ట్వీట్ చేశారు.
తాను ప్రధానమంత్రి కార్యాలయాన్ని విమర్శిస్తున్నానే తప్ప ప్రధానమంత్రిని కాదని కూడా స్వామి వివరణ ఇచ్చారు. ఇక ముందు ఆరోగ్య మంత్రిని తీసేయాలని ఓ వ్యక్తి చేసిన సూచనపైనా స్వామి మరో ట్వీట్లో స్పందించారు. లేదు లేదు హర్భవర్దన్కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆయనకు అధికారం చెలాయించలేకపోతున్నారు. గడ్కరీతో కలిస్తే ఆయన విజయవంతమవుతారు అని స్వామి స్పష్టం చేశారు. దేశమంతా కొవిడ్ సెకండ్ వేవ్తో, ఆక్సిజన్, మందుల కొరతతో అల్లాడుతున్న సమయంలో స్వామి ఈ కీలక సూచన చేయడం గమనార్హం. మరి మోదీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.