న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆరేండ్లపాటు ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. పిటిషన్లో ఎలాంటి విచారణ అర్హతలు లేవని జస్టిస్ సచిన్దత్తా ధర్మాసనం వెల్లడించింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే పిటిషన్లో పేర్కొన్నారు. దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతున్నారని, ఎన్నికల్లో పోటీచేయకుండా మోదీని అనర్హుడిగా ప్రకటించడంతోపాటు ఆరేండ్లపాటు ఆయనపై నిషేధం విధించాలని కోరారు. పిలిభిత్ ఎన్నికల ప్రచార సభలో హిందూ దేవతలు, ప్రార్థనా స్థలాలతోపాటు సిక్కు దేవతల పేర్లతో తమ పార్టీకి ఓట్లు వేయాలని మోదీ అడిగారని పిటిషన్లో న్యాయవాది ఆరోపించారు. విచారణ జరిపిన ఏకసభ్య ధర్మాసనం.. ‘ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్టు పిటిషనర్ భావించారు. ఆ భావన పూర్తిగా అసంబద్ధం. దీనిని ఆధారంగా చేసుకొని పిటిషనర్ కోరినట్టు నిర్దిష్ట ఆదేశాలు జారీచేయాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేం’ అని పేర్కొన్నది.