కొలంబో పోర్టులో పెట్టుబడులకు అదానీ
కంపెనీని నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఏడాది క్రితమే వెల్లడించిన శ్రీలంక మంత్రి
తాజా సంక్షోభం వేళ మరోసారి దుమారం
మోదీ సర్కారు అవినీతికి పరాకాష్ట
‘శ్రీలంక మంత్రి మాటలు ఒకసారి వినండి. ఆ దేశంలో ఒక ప్రాజెక్టు కోసం అదానీ గ్రూప్ను మోదీ నామినేట్ చేశారు. ఇది ముమ్మాటికీ అవినీతే. ఎలాంటి బిడ్లు ఆహ్వానించకుండా ఒక కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇది రాఫెల్ డీల్ కోసం అనిల్ అంబానీని నామినేట్ చేసిన పనిలాంటిదే . మోదీకి ఎలాంటి నియమాలు, నిబంధనలు లేవు’
– ట్విట్టర్లో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్భూషణ్
న్యూఢిల్లీ, జూన్ 20: శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపోతుండగా, తాజాగా కొలంబో నౌకాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టులో అదానీ పెట్టుబడుల అంశం భారత్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భారతదేశం తరఫున పెట్టుబడి భాగస్వామిగా అదానీ గ్రూప్ను మోదీ ప్రభుత్వమే నామినేట్ చేసిందని 2021 మార్చి 9న అప్పటి శ్రీలంక మంత్రి ఉదయ్ గమ్మనపిల కుండబద్దలు కొట్టారు. ఇది ముమ్మాటికీ ప్రధాని నరేంద్రమోదీ అవినీతి చర్యేనని ప్రతిపక్షాలు, మేధావులు మండిపడుతున్నారు. ప్రతిదానికీ అదానీ కంపెనీని మాత్రమే దేశం తరఫున మరో దేశంలో ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొలంబో పోర్టు వ్యవహారంపై భారత్లో రాజకీయ దుమారం రేగుతున్నది.
ఏమిటీ ప్రాజెక్టు?
శ్రీలంక రాజధాని కొలంబోలోని నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని ఆ దేశం కొన్నేండ్ల క్రితం నిర్ణయించింది. ముందుగా తూర్పువైపు క్యారియర్ టెర్మినల్ (ఈసీటీ) ప్రాజెక్టును చేపట్టింది. ఈ భారీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు భారత్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానించింది. దీంతో నరేంద్రమోదీ ప్రభుత్వం భారత్ తరఫున పెట్టుబడి భాగస్వామిగా అదానీ గ్రూప్ను నామినేట్ చేసిందని గమ్మనపిల తెలిపారు. ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం కొలంబో పోర్టు పశ్చిమ క్యారియర్ (డబ్ల్యూసీటీ) ప్రాజెక్టును జాయింట్ వెంచర్గా కాకుండా శ్రీలంక పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్తో శ్రీలంక ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు వివాదాస్పదం కావటంతో ఉదయ్ గమ్మనపిల అసలు విషయం బయటపెట్టారు. ‘ఈసీటీ ప్రాజెక్టులో భారత ప్రభుత్వమే అదానీ గ్రూప్ను నామినేట్ చేసింది. అందుకే డబ్ల్యూసీడీ ప్రాజెక్టులో కూడా ఆ దేశం తరఫున అదానీ గ్రూప్ను ఆహ్వానించాం’ అని తెలిపారు. అమెరికా, యూరప్లోని పెట్టుబడిదారీ దేశాల్లో ప్రైవేటు కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఆయా ప్రభుత్వాలే చొరవ తీసుకొని కాంట్రాక్టులు ఇప్పిస్తుంటాయి. దేశాధినేతలు విదేశీ పర్యటనలు చేసే సమయంలో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల బలగాలను వెంటేసుకొని వెళ్లి దగ్గరుండి కాంట్రాక్టులు ఇప్పిస్తుంటారు. మన దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చం అలాంటి విధానానికే తెరలేపింది.
మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్లో విదేశాల్లో ప్రైవేటు సంస్థల పెట్టుబడులకు ప్రభుత్వాలు వకాల్తా పుచ్చుకొనేవి కాదు. ఒకవేళ వేరే దేశంలోకి కంపెనీలతో మన దేశ కంపెనీలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొంటే వాటి అమలుకు ఇబ్బందులు లేకుండా చూసిన సందర్భాలు మాత్రమే ఉన్నాయి. కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత అన్ని నియమాలను మార్చేశారు. పెట్టుబడిదారీ దేశాల్లో పోటీ తత్వం ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు దేశంలోని అన్ని కంపెనీలకు విదేశీ పెట్టుబడుల్లో సమాన అవకాశాలు కల్పిస్తుంటాయి. కానీ మనదేశంలో ప్రభుత్వానికి సన్నిహితులైన ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకే అన్ని ప్రయోజనాలూ దక్కుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిపోయిందని ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు. శ్రీలంకలోని మన్నార్ జిల్లాలో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంటు నిర్మించాలని ఆ దేశం నిర్ణయించింది. అంతపెద్ద ప్రాజెక్టుకోసం ఆ దేశ చట్టాల ప్రకారం అంతర్జాతీయంగా బిడ్లు ఆహ్వానించాలి. కానీ ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్నకు ఎలాంటి బిడ్లు ఆహ్వానించకుండా, పోటీ లేకుండా కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఇటీవల బయటపడింది.
శ్రీలంక ఎలక్ట్రిసిటీ బోర్డు డైరెక్టర్గా ఉన్న ఎంఎన్సీ ఫెర్డినాండో ఏకంగా ఆ దేశ పార్లమెంటరీ కమిటీ ముందే ఈ విషయం బయటపెట్టారు. అధ్యక్షుడు గొటబయనే తనకు స్వయంగా ఈ విషయం చెప్పారని ఫెర్డినాండో వాంగ్మూలం ఇవ్వటం రెండు దేశాల్లో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా శ్రీలంకలో ఈ కాంట్రాక్టుకు వ్యతిరేకంగా వేలమంది భారీ ఉద్యమమే నిర్వహిస్తున్నారు. అంతకుముందే కొలంబో పోర్టు కోసం మోదీ సర్కారు అదానీ తరఫున వకాల్తా పుచ్చుకొన్నదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘శ్రీలంకలోనీ మీ తాపేదారు డీల్ కూడా మీకు తాత్కాలికంగా చేదు.. దీర్ఘకాలికంగా అధిక ప్రయోజనాల కిందికే వస్తుందా మోదీజీ?’అని సీపీఐఎం మహారాష్ట్రశాఖ ప్రశ్నించింది.