NCERT | న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదా? సమాజంలోని పరిస్థితులు తెలుసుకోకుండా చేయడానికి, విద్యార్థుల్లో వివేచనా శక్తి లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నదా? అంటే అవునని మేధావి వర్గాలు చెప్తున్నాయి. 2018లో మానవ వనరుల శాఖకు మంత్రిగా ఉన్న సత్యపాల్ సింగ్ డార్విన్ సిద్ధాంతం ట్రాష్ అంటూ కొట్టిపడేశారు. ‘ఒక కోతి మనిషిగా మారిన పరిణామ క్రమాన్ని ఎవరూ చూడలేదంటూ’ విమర్శించారు.
మానవుడు ఈ భూమిపైకి మనిషిగానే వచ్చాడని, మనిషిగా మరణిస్తాడని, పరిణామక్రమ సిద్ధాంతాన్ని బోధించడాన్ని స్కూళ్లు కాలేజీలు ఇకనైనా నిలిపివేయాలని అన్నారు. సత్యపాల్ సింగ్ ఎన్నడూ విద్యాశాఖమంత్రిగా చేయనప్పటికీ ఆయన ఆలోచనలు, ఆకాంక్షలను మాత్రం ఆచరణలో పెట్టింది మోదీ ప్రభుత్వం. అదే సమయంలో, మొఘలుల చరిత్ర, గాంధీ హత్య తదితర పాఠాలను ఎన్సీఈఆర్టీ తొలగించి ఇప్పటికే విమర్శలను మూటకట్టుకున్నది.
ఇప్పుడు జీవశాస్త్రంలో పరిణామ వాదం లాంటి పాఠాలను సైతం తొలగించి విద్యార్థుల్లో హేతుబద్ధతను, వివేచనా శక్తిని సైతం నిర్వీర్యం చేసేలా ఎన్సీఈఆర్టీ (NCERT) తన శక్తిమేరకు కృషి చేస్తున్నదని మేధావులు తప్పుబడుతున్నారు. రేపు న్యూటన్, ఐన్స్టీన్ ప్రస్తావనే లేకుండా ఫిజిక్స్ను బోధించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. జెనెటిక్స్, ఇమ్యునాలజీ వంటి పలు ఉప అంశాలు బోధనకు పరిణామ సిద్ధాంతంపై ప్రాథమిక అవగాహన అవసరమని, అయితే అది బోధించకుండా ఇవన్నీ నేర్పితే విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతారని వివరించారు.