విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చుడే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. జార్ఖండ్లో హేమంత్ సొరేన్ సర్కారును కూల్చేందుకు పావులు కదుపుతున్నది. మైనింగ్ లీజు వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాష్ట్రంలో ఈడీతో సోదాలు చేయించింది. తాజాగా సీఎంకు వ్యతిరేకంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్కు నివేదిక పంపించింది. సీఎం సొరేన్పై అనర్హత వేటు వేయాలని ఈసీ సూచించినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాంచి, ఆగస్టు 25: విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ మరో రాష్ట్రంలో తన మార్క్ రాజకీయాన్ని అమలుచేసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సర్కారును కూల్చేందుకు పావులు కదిపింది. మైనింగ్ లీజు వ్యవహారాన్ని ఇందుకు ఆయుధంగా మలుచుకుంది. గత నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఈడీతో దాడులు చేయించింది. ఈ అంశంలో బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం గవర్నర్కు సీల్డ్ కవర్లో నివేదిక అందించింది. సీఎం సొరెన్పై అనర్హత వేటువేయాలని గవర్నర్ రమేశ్ బాయిస్కు ఈసీ సూచించినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. తాజా పరిణామంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే, అనర్హత వేటు నిర్ణయంపై రాజ్భవన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. ఢిల్లీ పర్యటన నుంచి గురువారం మధ్యాహ్నం రాంచి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ బాయిస్ను మీడియా ఈ విషయమై ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘గడిచిన రెండు రోజులుగా నేను ఢిల్లీలో ఉన్నా. రాజ్భవన్కు చేరుకొని నివేదికను పరిశీలించిన తర్వాతనే నేనేమైనా చెప్పగలను’ అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం.. చట్టసభకు ఎన్నికైన ప్రతినిధిపై అనర్హత వేటు నిర్ణయం అంతిమంగా గవర్నరే తీసుకోవాలి. దీంతో బాయిస్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
మాకింకా ఎలాంటి సమాచారం లేదు: సొరేన్
అనర్హతవేటు నిర్ణయంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని సొరేన్ తెలిపారు. తనపై అనర్హత వేటుకు ఈసీ సిఫారసు చేసిందంటూ బీజేపీ నేతలు చెబుతుండటంపై సోరెన్ మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఉన్న నివేదికను కమలదళం నేతలే సొంతంగా రూపొందించి ఉంటారని ఎద్దేవా చేశారు. ‘అనర్హత విషయంపై రాజ్భవన్ నుంచి గానీ, ఎన్నికల సంఘం నుంచి గానీ సీఎంవోకు ఎలాంటి సమాచారం అందలేదు. ఓ బీజేపీ ఎంపీ, ఆయన చేతిలో కీలుబొమ్మల్లా ఉండే విలేకర్లు కొందరు ఓ తప్పుడు నివేదికను రూపొందించి అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘ఈసీ సీల్డ్ కవర్లో రాజ్భవన్కు పంపిన నివేదికలో ఉన్న విషయం బయటకు ఎలా తెలుస్తుంది?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను, ప్రభుత్వ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సిగ్గుమాలిన చర్యను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కొనుగలరేమోగానీ, ప్రజా మద్దతుని కాదని మోదీ సర్కారుకు చురకలు అంటించారు. ప్రజల మద్దతే తనకు అఖండ బలమని పేర్కొన్నారు. ఒక వేళ అనర్హత వేటు పడితే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు జేఎఎం తెలిపింది.
ప్రభుత్వానికి ఢోకా లేదు
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. అయితే, తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్ నేత, మంత్రి అలంగిరీ ఆలమ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సొరేన్పై అనర్హత వేటు పడినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు.
ఏమిటీ వివాదం?
స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరేన్ పొందారంటూ గవర్నర్ రమేశ్ బాయిస్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సొరేన్ తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం రఘుబర్దాస్ ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 9ఏ ప్రకారం సొరేన్పై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) గవర్నర్ కోరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీల్డ్ కవర్లో తన అభిప్రాయాన్ని ఈసీ.. రాజ్భవన్కు పంపించింది.