న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ లీ నింగ్తో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) తెగదెంపులు చేసుకుంది. దేశ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్న ఐవోఏ..ఈనెల ఆఖరికి కొత్త స్పాన్సర్తో ఒప్పందం చేసుకుంటామని తెలిపింది. వాస్తవానికి రానున్న టోక్యో విశ్వక్రీడలకు లీ నింగ్ కంపెనీ..ఐవోఏ అధికారిక స్పాన్సర్గా వ్యవహరించాల్సి ఉంది. గత వారం కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో విశ్వక్రీడల జెర్సీ ఆవిష్కరణ కూడా జరిగింది. అయితే గల్వాన్ ఘటన నేపథ్యంలో చైనా ఉత్పత్తులపై గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లీ నింగ్ కంపెనీతో కొనసాగడంపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో ఐవోఏ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై బుధవారం ఐవోఏ చీఫ్ నరిందర్ బాత్రా మాట్లాడుతూ ‘టోక్యో ఒలింపిక్స్ కోసం కొత్త స్పాన్సర్ను వెతికే పనిలో ఉన్నాం. ఈ నెల చివరికి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. విశ్వక్రీడలకు చాలా తక్కువ సమయముంది. అతి త్వరలోనే ప్లేయర్లకు అధికారిక జెర్సీలు అందజేస్తాం. పరస్పర అంగీకారంతోనే చైనా కంపెనీతో కాంట్రాక్టు రద్దు చేసుకున్నాం’ అని అన్నారు.