కేంద్ర ప్రభుత్వ వాటా 51 శాతం ప్రైవేటుపరం
211 కోట్లకు స్టార్9 మొబిలిటీ కన్సార్టియం చేతికి
ఆ కంపెనీ మొత్తం విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. పనిచేస్తున్న ఉద్యోగులు 1,000 మంది. ఇంతటి విలువైన కంపెనీని కేవలం రూ.211 కోట్లకు ప్రైవేటుపరం చేసింది మోదీ సర్కారు. ప్రభుత్వ ఏరోస్పేస్ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉన్న పవన్హన్స్ లిమిటెడ్ను కారుచౌకగా స్టార్9 మొబిలిటీ కంపెనీకి కట్టబెట్టింది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటమే పనిగా పెట్టుకొన్న బీజేపీ ప్రభుత్వం.. ఈ సంస్థను ఎలాగైనా అమ్మాలని ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నించింది కూడా. తాజాగా ఆ ప్రక్రియను పూర్తిచేసింది.
న్యూఢిల్లీ, మే 2: మొన్న ఎయిరిండియా, నిన్న ఎల్ఐసీ, ఇప్పుడు.. పవన్హన్స్. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేసేస్తున్నది కేంద్రంలోని మోదీ సర్కారు. ఆ సంస్థ లాభాల్లో ఉన్నదా? దాని వల్ల ఎంత మంది లబ్ధి పొందుతున్నారు? ఎంతమందికి ఉపాధి దక్కుతుందన్న అంశాలేవీ పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ సంస్థలను అంగట్లో అగ్గువకే బేరానికి పెడుతున్నది. ప్రముఖ ప్రభుత్వ రంగ హెలికాప్టర్ల సేవల సంస్థ పవన్హన్స్ లిమిటెడ్ను కూడా అలాగే అమ్మేసింది. 2019-20లో ఈ కంపెనీకి ఉన్న రెవెన్యూ.. రూ.376 కోట్లు. కానీ ఆ కంపెనీ విలువను భారీగా తగ్గించిన మోదీ సర్కారు.. కేవలం రూ.211.14 కోట్లకు స్టార్ 9 మొబిలిటీ కన్సార్టియం చేతిలో పెట్టేసింది.
పవన్హన్స్ లిమిటెడ్లో కేంద్రానికి 51 శాతం వాటా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ)కు 49 శాతం వాటా ఉన్నది. ఈ సంస్థ 42 హెలికాప్టర్లను నడుపుతున్నది. కేంద్రం తన వాటాను ఉపసంహరించుకొనేందుకు సిద్ధం కాగా, ఓఎన్జీసీ కూడా కేంద్రం నిర్ణయించిన మేరకే తన వాటాను అమ్మేందుకు రెడీ అయ్యింది. పవన్హన్స్ కోసం మొత్తం 3 బిడ్లు దాఖలయ్యాయి. స్టార్ 9 మొబిలిటీ రూ.211.14 కోట్లకు, మిగతా రెండు రూ.181.05 కోట్లు, 153.15 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. అందులో స్టార్ 9 మొబిలిటీ బిడ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి తాజాగా, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని కమిటీ పవన్హన్స్ అమ్మకానికి ఆమోదం తెలిపింది. నోయిడా, ముంబై, ఢిల్లీలో పెద్దయెత్తున స్థిరాస్తులు కలిగి, వెయ్యికి పైగా ఉద్యోగులతో, ఒక్కోటి రూ. 69 కోట్ల చొప్పున విలువ ఉండే 42 హెలికాప్టర్లను నడుపుతున్న పవన్హన్స్ను అత్యంత తక్కువ ధరకే ప్రభుత్వం అమ్మాకానికి పెట్టిందని వైమానిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విక్రయం లో గుడ్విల్ను కూడా పరిగణనలోకి తీసుకోలేదని వాపోతున్నారు.
భారీ మోసం: కాంగ్రెస్
పవన్హన్స్ అమ్మకం భారీ మోసమని కాంగ్రెస్ ఆరోపించింది. రెండు బిడ్లు రిజర్వు ధర కంటే తక్కువకే నమోదు కావటం ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించింది. కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాతో మాట్లాడుతూ.. స్టార్9 మొబిలిటీ కన్సార్టియంలో ఉన్న మహారాజా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి ఇంటర్నెట్లో ఎలాంటి వివరాలు లేవని తెలిపారు. ఆ పేరుతో ఫేస్బుక్ ఉన్నా, అందులో బాబా రామ్దేవ్ ఫొటోలు ఉన్నాయని పేర్కొన్నారు.