కరోనా తర్వాత కరెంట్ వినియోగాన్ని అంచనా వేయని కేంద్రం
డిమాండ్కు తగినట్టుగా ప్రణాళికను సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం
ముందస్తుగా బొగ్గు నిల్వ, సరఫరా విషయంలోనూ నిర్లిప్తత
హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏడాదిలోనే రెండు సార్లు విద్యుత్తు సంక్షోభం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణం. ఏటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, కరోనా తర్వాత మరింతగా వచ్చే డిమాండ్ను అంచనా వేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి కావాల్సిన ప్రణాళికను సిద్ధంచేసి అమలు చేయడంలోనూ వైఫల్యం చెందింది. వాస్తవానికి దేశంలో సుమారు 399 గిగావాట్లకు పైగా విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ గతంలో ఎన్నడూ 200 గిగావాట్ల డిమాండ్ దాటలేదు. కరోనా తరువాత విద్యుత్తువినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో డిమాండ్ గణనీయంగా పెరిగింది.
అయితే సరిపోడా విద్యుత్తును ఉత్పత్తిచేసే సామర్థ్యం మనకు ఉన్నా.. వాటిని సక్రమంగా ఉపయోగించుకోలేని కేంద్రం అసమర్థత వల్ల 204 గిగావాట్లు దాటితేనే కోతలు విధించాల్సిన దుస్థితిని దేశంలోని తెలంగాణ మినహా అన్ని రాష్ర్టాలు ఎదుర్కొంటున్నాయి. గృహ రంగానికి కోతలు.. పరిశ్రమలకు హాలీడేలు తప్పట్లేదు. ఉత్పత్తి అవుతున్న బొగ్గును విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు తరలించడంలోనూ.. కేంద్రం నిర్లక్ష్యం, నిర్లిప్తత, అసమర్థత మరో రూపంలోనూ కనపడుతున్నది. బొగ్గును తరలించడానికి కావాల్సినన్ని రైల్వే వ్యాగన్లను అందుబాటులో ఉంచకపోవడం కూడా విద్యుత్తు సంక్షోభానికి మరో కారణం. బొగ్గు కొరతను అంచనా వేసి.. ముందుగానే చర్యలు తీసుకుంటే ఈ సమస్య ఎదురయ్యేదికాదు. ఇప్పుడు తాపీగా.. 100 బొగ్గు గనులను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశమంతా సంక్షోభం ముదిరిపోయాక.. ఇప్పుడు రైల్వే వ్యాగన్లను పెంచేలా చర్యలు తీసుకుంటున్నది.
అందుకే కరెంట్ కటకట: క్లైమేట్ రిస్క్
ఆరేండ్ల క్రితం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం.. పునరుత్పాదక శక్తి ద్వారా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లయితే భారత్ విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొనేదే కాదని మేధోసంస్థ ైక్లెమేట్ రిస్క్ హారిజన్స్ తన నివేదికలో వెల్లడించింది. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడమే లక్ష్యమంటూ 2016లో మోదీ సర్కారు తీర్మానించిన విషయాన్ని గుర్తుచేసింది. గత ఏప్రిల్ నాటికి పవన, సౌర వ్యవస్థల ద్వారా 95 గిగావాట్ల విద్యుదుత్పత్తి మాత్ర మే జరిగినట్టు వెల్లడించింది. ఈ ఏడాది చివరినాటికైనా లక్ష్యాలను చేరుకోవాల్సి ఉందని పేర్కొన్నది.