పప్పుల ఓపెన్ ఇంపోర్ట్ పాలసీతో రైతు కుదేలు
కంది, పెసర, మినుమ పప్పు ధరలు ఢమాల్
మన రైతులకు కనీస మద్దతు ధరా కరువే
సర్కారు దెబ్బకు దేశంలో తగ్గిన సాగు విస్తీర్ణం
సమయానుకూల నిర్ణయాల్లో సర్కారు విఫలం
న్యూఢిల్లీ, జూన్ 24: జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్లో ఆహార భద్రత అనేది ప్రభుత్వాలకు ముఖ్యమైన బాధ్యత. 140 కోట్ల జనాభాకు సరిపడా తిండిగింజలు అందుబాటులో ఉంచటం ముఖ్యం. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు మన ప్రధాన ఆహార ఉత్పత్తులైన బియ్యం, గోధుమలు, నూనె గింజలు, పప్పు ధాన్యాల దిగుబడిలో స్వయం సమృద్ధి సాధించటం మరింత ముఖ్యం. కానీ వ్యవసాయం బీజేపీ సర్కారు అనాలోచిత, అడ్డదిడ్డ విధానాలతో కుదేలవుతున్నది. పప్పు ధాన్యాల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఓపెన్ ఇంపోర్ట్ పాలసీ రైతుల నడ్డి విరిచింది. ఏడాది కాలం గా పప్పుధాన్యాలు ఎంఎస్పీ కంటే తక్కువకు అమ్ముడు పోతుండటంతో రైతులకు పెట్టుబడి కూడా రావట్లేదు. సర్కారు దెబ్బకు రైతులు పప్పు ధాన్యాల పంటలు వేయాలంటేనే భయపడుతున్నారు. ఆ పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది.
పప్పే మన ‘పల్స్’
వరి, గోధుమలు మనకు అవసరమైన వాటికంటే ఎక్కువే పండిస్తున్నాం. పప్పు ధాన్యాల సాగు విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నాం. ఏటా టన్నులకొద్ది పప్పులను దిగుమతి చేసుకొంటున్నాం. 2019లో పప్పు ధాన్యాల కొర త ఏర్పడటంతో 2020-21లో ధరలు విపరీతంగా పెరిగాయి. పప్పుల దిగుమతిని వేగవంతం చేసేందుకు కేంద్రం కొన్ని విధానాలు అవలంబిస్తుంది. అందులో ఓపెన్ ఇంపోర్ట్ పాలసీ ఒకటి. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ దిగుమతులపై పరిమితులు విధిస్తుంది. అప్పుడు దేశీయ రైతుల పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించటంతోపాటు వినియోగదారులకు కూడా సరసమైన ధరలకు పప్పులు లభిస్తాయి. ఇది ఏటా జరిగే సాధారణ ప్రక్రియ. కానీ, మోదీ సర్కారు సరైన సమయంలో తగు నిర్ణయాలు తీసుకోకపోవటంతో దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యాలకు ప్రభుత్వమే పాతరేసినట్టయ్యింది.
ఏం జరిగింది?
1. మార్చి 19, 2021: 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకొనేందుకు భారత ప్రభుత్వం మొజాంబిక్తో ఒప్పందం కుదుర్చుకొన్నది.
2. మే 15, 2021: కంది, పెసర, మినుమ పప్పు దిగుమతులపై పరిమితులను ఎత్తేసింది. 2021 అక్టోబర్ 31 వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. అదే ఏడాది జూలై 26న అమెరికాయేతర దేశాల నుంచి దిగుమతి చేసుకొనే పప్పు ధాన్యాలపై పన్నును ఎత్తేసింది. కంది, మినుము పప్పు దిగుమతులపై స్వేచ్ఛాయుత విధానాన్ని 2021 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2022 మార్చి వరకు మరోసారి పొడిగించింది.
3. జూలై 2, 2021: పెసర పప్పు మినహా అన్నిరకాల పప్పులను పరిమితికి మించి నిల్వ చేయరాదని ఆదేశించింది. అధిక నిల్వలను 2021 డిసెంబర్ 31లోగా మార్కెట్లోకి విడుదల చేయాలని వ్యాపారులకు స్పష్టంచేసింది.
4. జూలై 26, 2021: మసూర్ (ఎర్ర) పప్పు దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తేసింది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ని పది శాతానికి తగ్గించింది. నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నిల్వల నుంచి 3 లక్షల టన్నుల పప్పు ధాన్యాలను మార్కెట్లోకి విడుదల చేయాలని ఆదేశించింది.
5. మార్చి 29, 2022: కంది, మినుము పప్పు దిగుమతులపై ఉన్న స్వేచ్ఛా విధానాన్ని 2023 మార్చి 31 వరకు పొడిగించింది.