అడ్డగోలు విధానాలతో దేశ ఆస్తులను తన కార్పొరేట్ సన్నిహితులకు దోచిపెడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్.. పేదల సంక్షేమంపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. తాయిలాలతో కార్పొరేట్లను అందలం ఎక్కిస్తూ.. రోజువారీ కూలీతో పొట్టు పోసుకొనే కూలీలపై కక్ష కట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధిపరంగా ఎంతో కీలకమైన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నీరుగారుస్తూ వస్తున్నది. సరిపడా నిధులు కేటాయించకపోవడంతో పేదలు ఉపాధి నిరాకరణకు గురవుతున్నారు. ‘పని ఇవ్వండి, చేసుకొంటాం’ అని దరఖాస్తు పెట్టుకొన్నా.. కోట్ల మందికి పని దక్కని పరిస్థితి నెలకొన్నది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని దరఖాస్తు పెట్టుకొన్న కోట్ల మందికి పని దొరకడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ వెబ్సైట్లోని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23) మొదటి ఆరు నెలల్లో(ఏప్రిల్ నుంచి అక్టోబర్) దాదాపు 1.5 కోట్ల మంది ఉపాధి తిరస్కరణకు గురయ్యారు. ఈ పరిస్థితి ఈ ఏడాదే కాదు.. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం కింద డిమాండ్కు తగ్గ పని దొరకడం లేదు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 2020-21, 2021-22లలో ఉపాధి పని తిరస్కరణ అధికస్థాయిలో ఉన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే పనికి దరఖాస్తు చేసుకొన్న వారిలో తిరస్కరణకు గురైన వారి సంఖ్య దాదాపు 18 శాతంగా ఉన్నదంటే.. ఉపాధి హామీ పథకం ఎంతమేరకు నీరుగారుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అధికారిక గణాంకాల ప్రకారమే తిరస్కరణకు గురైన వారి సంఖ్య కోట్లలో ఉంటుంటే.. అనధికారికంగా ఇంకా భారీగా ఉండే అవకాశం ఉండవచ్చుననే అంచనాలు ఉన్నాయి.
డిమాండ్ సూత్రం పాయే..
ఉపాధి హామీ పథకం అంటే డిమాండ్కు తగ్గట్టు పని కల్పించాలి. పని కల్పించాలని దరఖాస్తు చేసుకొంటే కచ్చితంగా ఉపాధి కల్పించాలి. అయితే మోదీ సర్కార్ హయాంలో కనిపిస్తున్న గణాంకాలను చూస్తుంటే ఈ మూల సూత్రం మూలన పడిపోయినట్టు కనిపిస్తున్నది. అయితే ఉపాధి హామీ పథకం కింద పని దొరక్కపోతుండటంతో గతి లేక ప్రజలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలు, రాష్ర్టాలకు వలస పోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
అరకొర నిధులు.. బకాయిలు
ఉపాధి హామీ కింద ప్రజలందరికీ డిమాండ్కు తగినట్టుగా పని దొరకకపోవడానికి కేంద్రం కేటాయిస్తున్న అరకొర నిధులే ప్రధాన కారణంగా ఉన్నది. 2022-23 బడ్జెట్లో 2021-22 సవరించిన అంచనాల కంటే 25 శాతం తక్కువగా రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. నిధుల విడుదలలో కూడా ఆలస్యం పరిస్థితిని మరింత దిగజారుస్తున్నది. పని చేసిన వారికి ఇవ్వాల్సిన వేతనాలు బకాయిలుగా పేరుకుపోతున్నాయి. అక్టోబర్ 22 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఉపాధి హామీ పథకానికి రూ.59,795 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అక్టోబర్ 22 నాటికే రూ.57,801 కోట్లు వ్యయం కాగా, వేతనాలతో సహా రూ.6,247 కోట్లు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అంటే మొదటి ఆరు నెలలకే రూ.4,254 కోట్లు లోటు పడిందన్న మాట.