న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇవాళ రోడ్లశాఖ గ్రాంట్లపై లోక్సభలో మాట్లాడారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైనట్లు ఆయన ఆరోపించారు. భారత్మాల ప్రాజెక్టు కింద మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిర్మాణ హామీలను నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. 21 శాతం మాత్రమే భారత్మాలలో పనులు జరిగినట్లు తెలిపారు. నేషనల్ హైవేస్లోకి ప్రైవేటు ఇన్వెస్టర్లను ఎందుకు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు.
2014-15 తర్వాత ప్రైవేట్ పెట్టుబడి 7 శాతానికి తగ్గినట్లు రేవంత్ ఆరోపించారు. దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. ట్రంప్ను గెలిపించేందుకు ప్రధాని మోదీ అమెరికా వెళ్లారని, కానీ అక్కడ 51 శాతం కేటాయింపులు రోడ్ల అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారని, కానీ ఇక్కడ రోడ్ల భద్రత కోసం బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉన్నాయన్నారు. రోడ్ల మెయిన్టేన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఇండియన్ నెంబర్ వన్ ర్యాంక్లో ఉన్నట్లు రేవంత్ తెలిపారు.
రోడ్ల శాఖకు సమృద్ధిగా బడ్జెట్ను కేటాయించాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల దేశంలో నిమిషానికి 4 మంది చనిపోతున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే జరుగుతోందని ఆయన అన్నారు. 34వేల కిలోమీటర్ల నిర్మిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే మోదీ సర్కార్ నిర్మించినట్లు రేవంత్ ఆరోపించారు. జుమ్లా హామీలు ఇస్తూ ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. రోడ్ల శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకటి చెబుతోంది, మరోకటి చేస్తోందన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలు స్టేషన్లలో ఛాయ అమ్ముకుంటున్నాయని, దేశమంతా ఇలా ఛాయ్ అమ్ముకునేలా చేయవద్దు అని రేవంత్ కోరారు. మహబూబ్నగర్, చించోలీ మధ్య హైవేను నిర్మించాలని డిమాండ్ చేశారు.