Sonia Gandhi : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు చేశారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం (Modi govt) దశాబ్దకాలంగా అనేక ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. ఇటీవల ఈ చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేయడంతోపాటు దేశంలో కోట్లాదిమంది రైతులు, కార్మికులు, భూమిలేని వారి ప్రయోజనాలపై కేంద్ర ప్రభుత్వం దాడి చేసిందని మండిపడ్డారు. ఈ మేరకు సోనియా గాంధీ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు.
సరిగ్గా 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని పార్లమెంటు ఏకాభిప్రాయంతో ఆమోదించిన విషయాన్ని సోనియా గాంధీ గుర్తుచేశారు. అదో విప్లవాత్మకమైన అడుగు అని.. అత్యంత పేదలు, అణగారినవారి జీవితాలకు ఆ పథకం ఉపాధి మార్గంగా నిలిచిందన్నారు. వలసలు ఆగిపోవడమే కాకుండా, ఉపాధికి హామీ దక్కిందన్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తీసుకొచ్చిన ఆ పథకాన్ని మోదీ ప్రభుత్వం అణచివేసిందని ఆరోపించారు.
గడిచిన 11 ఏళ్లుగా గ్రామీణ పేదల ప్రయోజనాలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం.. మహాత్ముడి పేరును తొలగించడమేగాక పథకం స్వరూపాన్నే మార్చిందని సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా, విపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చట్టాన్ని మార్చివేయడం దారుణమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.