న్యూఢిల్లీ: 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అల్లర్ల సమయంలో ఏం జరిగిందో ఆయన ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 19 ఏళ్లుగా తప్పుడు ఆరోపణల్ని మోదీ మౌనంగా ఎదుర్కొన్నట్లు షా వెల్లడించారు. మోదీపై విమర్శలు వస్తున్నా.. ఎవరూ కూడా ధర్నా చేయలేదన్నారు. గుజరాత్ అల్లర్లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా 19 ఏళ్లు మోదీ పోరాటం చేశారని, శివుడు తన గొంతులో విషాన్ని దాచినట్లు మోదీ కూడా ఆ బాధను దిగమింగినట్లు చెప్పారు. మోదీ బాధను చాలా దగ్గర నుంచి చూచినట్లు తెలిపారు. చాలా ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు మాత్రమే ఆ అంశం గురించి ఏమీ మాట్లాడరని, ఎందుకంటే ఆ కేసు కోర్టు పరిధిలో ఉందని షా తెలిపారు. సిట్ విచారణకు హాజరయ్యే సమయంలో మోదీ ధర్నా చేయలేదని, తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలు, ఎంపీలతో ధర్నా చేయించలేదన్నారు. సీఎంను సిట్ విచారించాలని భావిస్తే, ఆయన దానికి సహకరించినట్లు తెలిపారు. నిరసనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తుంటే, ఆ పార్టీ నేతలు ధర్నాలు చేస్తున్నారన్న భావం వచ్చే అమిత్ షా విమర్శలు చేశారు.