(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): 2002 గుజరాత్ అల్లర్లు, ఆ ఉదంతంలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించింది. అల్లర్లకు మోదీనే బాధ్యుడని బ్రిటన్ ప్రభుత్వ రహస్య విచారణలో తేలిందని అందులో పేర్కొన్నది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరిట రూపొందించిన రెండు భాగాల్లో మొదటి ఎపిసోడ్ను గురువారం యూట్యూబ్ (ఇండియా)లో అప్లోడ్ చేసింది. అయితే, అప్లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే కేంద్ర ఐటీశాఖ ఈ వీడియోను తొలగించింది.
డాక్యుమెంటరీలోని అంశాలను కేంద్రం ఖండించింది. ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేయడానికి, ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ డాక్యుమెంటరీ తీసుకొచ్చిందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ధ్వజమెత్తారు. కాగా, 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ పాత్ర గురించి వాదనలను పరిశీలించడం ఈ డాక్యుమెంటరీ ఉద్దేశంగా రూపకర్తలు వెల్లడించారు.