రక్షణ రంగంలో భారత్ను స్వావలంబనగా మార్చేందుకు ప్రయత్నం చేయాలని, ఇందు కోసం వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. భారత రక్షణ రంగంలో గ్లోబల్ టెక్ వినియోగంతో పాటు.. రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న విధానాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశ భద్రత, తాజా ప్రపంచ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.
ఉక్రెయిన్లోని తాజా పరిణామాలు, ఆపరేషన్ గంగా, భారతీయుల తరలింపు వ్యవహారాలపై సీనియర్ అధికారులు ప్రధాని మోదీకి క్షుణ్ణంగా వివరించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు దేశ సరిహద్దుల్లో రక్షణ చర్యలు, మిలటరీ సన్నద్ధత గురించి కూడా అధికారులు మోదీకి వివరించారు. ఇక రష్యా కాల్పుల్లో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన కర్నాటక విద్యార్థి నవీన్ మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు అధికారులు అన్నిప్రయత్నాలూ చేయాలని మోదీ ఈ సందర్భంగా ఆదేశించారు.