PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): అధికారాన్ని అప్పగిస్తే వచ్చే ఐదేండ్లలో తామేం చేస్తామన్న విషయాలను కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెడ్తాయి. ఐదేండ్లపాలనలో తామేం చేసి చూపించామో.. ఇంకా మిగిలిపోయిన పనులను ఎప్పటిలోపు పూర్తిచేస్తామో అనే విషయాలను అధికార పార్టీలు ప్రజలకు వివరిస్తాయి. అయితే, బీజేపీ రూటే సపరేటు. మరో తొమ్మిది నెలల్లో లోక్సభకు ఎన్నికలు ఉన్నాయనగా.. ఇప్పుడు, లక్షల కోట్ల విలువైన కొత్త పథకాలను కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్నది. సరే.. ఆ తీసుకొస్తున్న పథకాలను రానున్న ఎన్నికల్లోపు పూర్తిచేస్తారా? అంటే అదీలేదు. ఒక్కో స్కీమ్కు ఐదు నుంచి పదేండ్ల కాలపరిమితిని నిర్ణయించారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన రూ. 1.18 లక్షల కోట్ల విలువైన ఈ స్కీమ్లు ప్రజలను మభ్యపెట్టేందుకు పరోక్షంగా ప్రకటించిన ఎన్నికల తాయిలాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
☛ ‘డిజిటల్ ఇండియా’ ప్రోగ్రామ్ను మరింత విస్తరించడానికి రానున్న ఐదేండ్లలో రూ. 14,903 కోట్లను ఖర్చుపెట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. సుమారు 8 లక్షల మందికి ఐటీలో నైపుణ్యాలను మెరుగుపర్చడానికి శిక్షణ ఇస్తామన్నది. కాగా, 2015లో ప్రారంభించిన ‘డిజిటల్ ఇండియా’ స్కీమ్ కోసం ఇప్పటివరకూ రూ. 20 వేల కోట్లవరకూ కేంద్రం ఖర్చుపెట్టినట్టు నివేదికలు చెబుతున్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో ఆశావహులకు నైపుణ్యాలను మెరుగుపర్చడంలో ఈ స్కీమ్ వెనుకబడినట్టు గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన ఐటీ ట్రైనింగ్ యూనిట్లలో చాలావరకూ మూతబడ్డాయి. ఇలాంటి సమయంలో డిజిటల్ ఇండియా స్కీమ్ను మరింత విస్తరిస్తామనడం విమర్శలకు తావిస్తున్నది.
☛ ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన ‘విశ్వకర్మ’ పథకం కోసం రూ.13 వేల కోట్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాగా,తెలంగాణలో కులవృత్తుల కోసం అమలుచేస్తున్న రూ. లక్ష సాయం పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం ‘విశ్వకర్మ’ పేరుతో ముందుకొచ్చింది. ఒకవైపు తెలంగాణ సర్కారు కులవృత్తుల వారికి రూ. లక్ష సాయాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా ఉచితంగా అందిస్తుంటే, కేంద్రం మాత్రం చేతివృత్తుల కళాకారులకు రాయితీపై 5 శాతం వడ్డీరేటుతో రుణాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అంటే సాయం ‘ఫ్రీ’కాదన్న మాట.
☛ రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో 2,339 కిలోమీటర్ల పొడవైన ఏడు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈపీఎస్ పద్ధతిలో ఈ ప్రాజెక్టును కాంట్రాక్ట్కు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈపీఎస్లో అక్రమాలకు ఆస్కారం ఉన్నదన్న కారణంగా 2015లోనే తెలంగాణ ఈ సిస్టమ్ను రద్దు చేసింది. అయితే, కేంద్రం రైల్వే కాంట్రాక్టును ఈపీఎస్ పద్ధతిన ఇస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, ఈ ఆర్థిక సంవత్సరంలో 7 వేల కిలోమీటర్ల మేర రైల్వేట్రాక్లను విస్తరిస్తామని బడ్జెట్ సమయంలో కేంద్రం గొప్పలకు పోయింది. ఇప్పుడు దాన్ని 2,339 కిలోమీటర్లకు కుదించింది.
☛ పట్టణాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు 169 నగరాల్లో పీపీపీ మోడల్ కింద 10 వేల ఈ-బస్సులతో ‘పీఎం ఈ-బస్ సేవ’ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. రానున్న పదేండ్లలో చేపట్టే ఈ స్కీమ్ కొరకు అత్యధికంగా రూ. 57,613 కోట్లను కేటాయించింది. ఇందులో రూ. 20 వేల కోట్లను మాత్రమే కేంద్రం భరించనున్నది. మిగతాది రాష్ర్టాలే ఇవ్వాలి. అయితే, క్రెడిట్ మాత్రం కేంద్రం ఖాతాలోకి పోతుండటం గమనార్హం.