Model Code of Conduct | సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నగారా మోగించింది. వచ్చేనెల 19 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడతాయి. లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీన్నే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అంటారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత నేతలు కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తారు. ఈ కోడ్.. దాని ఉల్లంఘన ఏమిటి తెలుసుకుందాం.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండగా అధికార పార్టీ ప్రచారంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఓటర్లను ప్రభావితం చేసే విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, స్కీమ్స్ ప్రకటించొద్దు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజాధనం వాడొద్దు. పత్రికల్లో, ఇతర మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రకటనలు ఇవ్వడం నేరంగా భావిస్తారు.
ఎన్నికల ప్రచారంలో మంత్రులు అధికారిక వాహనాలు వాడొద్దు. ప్రభుత్వ గెస్ట్ హౌజ్ ల్లో బస చేయొద్దు. పైలట్ కార్లు వాడరాదు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో మంత్రులు, ఇతర రాజకీయ నేతల ఫోటోలు, పార్టీల ప్రస్తావనలు తొలగించాలి.
ప్రత్యర్థులపై విమర్శలు చేయొచ్చు కానీ వ్యక్తిగత దూషణలకు దిగ కూడదు. కులం, మతం పేరిట దూషించి ఎన్నికల్లో లబ్ధి పొందడం నియామవళికి వ్యతిరేకం అవుతుంది. ప్రార్థనా మందిరాలను ఎన్నికల ప్రచారానికి వాడొద్దు. కుల, మతాలతోపాటు భాషల మధ్య చిచ్చు పెట్టడం కూడా కోడ్ ఉల్లంఘించడమే అవుతుంది.
రాత్రి పది గంటల నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ లౌడ్ స్పీకర్లు వాడాలంటే స్థానిక అధికారుల పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రాజ్యాంగంలోని పేర్కొన్న ఆదర్శాలకు అనుగుణంగా మ్యానిఫెస్టో ఉండాలి. పార్టీలిచ్చే హామీల్లో హేతుబద్ధత ఉండాలి.
పోలింగ్ కు 48 గంటల ముందు ప్రచారం చేయొద్దు. పోలింగ్ రోజు పోలింగ్ బూత్ కు 100 మీటర్ల దూరంలో ప్రచారం కూడా నేరమే. పోలింగ్ నాడు సొంత వాహనాల్లో పోలింగ్ స్టేషన్లకు ఓటర్లను తరలించకూడదు.
ఎన్నికల వేళ పార్టీలు నగదు తరలింపునకు వేర్వేరు మార్గాలు అనుసరిస్తాయి. సాధారణ పౌరులు ఎన్నికల కోడ్ సమయంలో అధిక మొత్తంలో నగదు తీసుకెళ్లాల్సి వచ్చినా, విలువైన వస్తువులు తీసుకెళ్లాల్సి వచ్చినా సంబంధిత బిల్లులు వెంట తీసుకెళ్లడం మంచిదని చెబుతున్నారు.