MoD | రక్షణ శాఖ కొనుగోళ్ల సమయ పరిమితిని గణనీయంగా తగ్గించింది. దాంతో సైనిక పరికరాల కొనుగోలులో చాలా సమయం ఆదా అవుతుందని రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. రక్షణ కొనుగోళ్లలో సమగ్ర సంస్కరణలు, రక్షణ రంగంలో స్వావలంబన సాధించడం లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకువచ్చినట్లు రక్షణ కార్యదర్శి తెలిపారు. రాజధాని ఢిల్లీలో జరిగిన రక్షణ సమావేశంలో మాట్లాడుతూ సంస్కరణలతో రక్షణ కొనుగోలు ప్రక్రియలో 69 వారాలు ఆదా అవుతుందని రక్షణశాఖ కార్యదర్శి చెప్పారు. ఇటీవల వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ సీఐఐ బిజినెస్ సమ్మిట్లో రక్షణ ప్రాజెక్టుల్లో జాప్యం, సమయపాలన, వ్యవస్థాగత సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రక్షణ మంత్రి సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజేశ్ కుమార్ ఈ సింగ్ ఈ ప్రకటన చేశారు.
సైన్యం కార్యాచరణ సంసిద్ధతపై ఆయుధాల సేకరణ ఆలస్యం ప్రభావంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ రంగంలోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయని.. కానీ, ఆయుధాలు మాత్రం అందవన్నారు. ఇందులో టైమ్లైన్ అనేది ప్రధాన సమస్య అని.. సకాలంలో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గుర్తుకురావట్లేదన్నారు. మనం చేయలేని పనికి వాగ్ధానాలు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తేజస్ ఎంకే1 చాలా ఆలస్యమందైని.. ఇక తేజస్ ఎంకే2 ప్రొటోటైప్ సైతం అందుబాటులోకి రాలేదన్నారు. ఆమ్కా ఫైటర్కు సంబంధించి ఇప్పటివరకు ప్రొటోటైప్ కూడా రాలేదని గుర్తు చేశారు. మన దళాలు- పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పారదర్శకత చాలా అవసరం ఉంటుందన్నారు. మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దాన్ని అందించి తీరాల్సిందేనన్నారు. మేకిన్ ఇండియా కోసం వాయుసేన శక్తివంచన లేకుండా పని చేస్తుందన్న ఆయన.. మనం ఈ రోజు సంసిద్ధంగా ఉంటేనే భవిష్యత్తుకు సిద్ధం కాగలమన్నారు.
దళాలను శక్తిమంతం చేసుకొంటేనే యుద్ధాలు గెలుస్తామన్నారు. రక్షణశాఖ కార్యదర్శి మాట్లాడుతూ 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 32 ట్రిలియన్ డాలర్లకు చేర్చడానికి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తికి స్వావలంబన అవసరమని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో రక్షణ రంగంలో ప్రారంభమైన స్వదేశీకరణ కారణంగా, 2015 సంవత్సరంలో భారతదేశం అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా ఉండగా.. నేడు భారత్ టాప్ 25 ఎగుమతిదారుల్లో ఒకటిగా నిలిచిందన్నారు. వందకుపైగా భారతీయ కంపెనీలు వందకుపైగా దేశాలకు ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాయన్నారు. ఇందులో బ్రహ్మోస్ మిస్సైల్స్, రాకెట్ లాంచర్ పినాకా, సిమ్యులేటర్ ఆర్మర్డ్ వాహనాలు ఉన్నాయన్నారు. గత సంవత్సరం రూ. 23,622 కోట్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేసినట్లు ఆయన తెలిపారు.